Crime News | రాత్రికి భార్యను పంపిస్తేనే ట్రాన్స్ఫర్.. బాస్ దాష్టీకం, ఆత్మహత్య చేసుకున్న చిరుద్యోగి
12 April 2022, 20:46 IST
- ఉత్తరప్రదేశ్ లో బాస్ దుర్మార్గానికి ఒక చిరుద్యోగి బలయ్యాడు. ట్రాన్స్ఫర్ చేయాలని కోరిన పాపానికి ఆ చిరుద్యోగి భార్యను రాత్రికి తన ఇంటికి పంపాలని ఒత్తిడి చేశాడా కీచక బాస్. అవమానం తట్టకోలేక శరీరంపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడా ఉద్యోగి.
ప్రతీకాత్మక చిత్రం
యూపీలోని లఖీంపుర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోకుల్ ప్రసాద్ అనే ఉద్యోగి జూనియర్ ఇంజినీర్ కార్యాలయ పరిధిలో లైన్మ్యాన్ గా పని చేస్తున్నారు. ఆయనకు అలీగంజ్కు బదిలీ అయింది. ఆఫీస్ దూరమైందని, ఇంటి నుంచి రోజూ వెళ్లిరావడం ఇబ్బంది అవుతోందని, అందువల్ల తనను మళ్లీ తన ఇంటి దగ్గరలోని కార్యాలయానికి బదిలీ చేయాలని చాన్నాళ్లుగా జూనియర్ ఇంజినీర్ నాగేంద్ర కుమార్ను అభ్యర్థిస్తున్నారు.
దాంతో, `ట్రాన్స్ఫర్ కావాలంటే నీ భార్యను రాత్రికి నా వద్దకు పంపించు` అని డిమాండ్ చేశాడు నాగేంద్ర కుమార్. దీనికి అదే కార్యాలయంలో పనిచేస్తున్న మరో క్లర్క్ వంతపాడాడు. దీంతో మనస్తాపానికి గురైన గోకుల్ ప్రసాద్ జూనియర్ ఇంజినీర్ కార్యాలయం ముందే శరీరంపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
అంతకుముందు, చికిత్స పొందుతూ, జూనియర్ ఇంజినీర్ దారుణాలను ఒక వీడియోలో వివరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జూనియర్ ఇంజినీర్ నాగేంద్ర కుమార్ను, మరో క్లర్క్ను అదుపులోకి తీసుకున్నారు. గత మూడేళ్లుగా నాగేంద్ర కుమార్ తన భర్తను వేధిస్తున్నాడని బాధితుడి భార్య ఆరోపించింది. ఆ వివరాలను ఆమె మరో వీడియోలో వెల్లడించింది.
`మూడేళ్లుగా వాళ్లు నా భర్తను వేధిస్తున్నారు. ఆ టెన్షన్తో నా భర్త డిప్రెషన్లోకి వెళ్లాడు. మందులు వేసుకోవడం మానేశాడు. ఆఫీస్ దూరమైంది.. ట్రాన్స్ఫర్ చేయాలని కోరితే.. నీ భార్యను రాత్రికి పంపించమని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది` అని ఆమె వాపోయింది. ట్రాన్స్ఫర్ చేయాలని అడిగితే, జూనియర్ ఇంజినీర్ దుర్భాషలాడాడని, డబ్బులు డిమాండ్ చేశాడని లైన్మ్యాన్ గోకుల్ ప్రసాద్ ఫిర్యాదు చేశాడని పోలీసు అధికారి సంజీవ్ సుమన్ తెలిపారు. కేసు రిజిస్టర్ చేశామన్నారు. జూనియర్ ఇంజినీర్ నాగేంద్ర కుమార్ను అధికారులు సస్పెండ్ చేశారు.
టాపిక్