Mamata on PM Modi : తొలిసారి మోదీపై సానుకూలంగా మాట్లాడిన దీదీ.. అదే కారణమా?
19 September 2022, 22:10 IST
Mamata on PM Modi : మమతా బెనర్జీ.. తొలిసారి మోదీపై సానుకూలంగా మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ఆరోపణలపై స్పందించిన ఆమె.. అందులో మోదీ పాత్ర ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
మమతా బెనర్జీ
Mamata comments on PM Modi : దేశ రాజకీయాల్లో సోమవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిత్యం నిప్పులు చెరిగే పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. తొలిసారిగా ఆయనపై సానుకూలంగా మాట్లాడారు! అది కూడా.. దేశంలో హాట్టాపిక్గా మారిన కేంద్ర దర్యాప్తు సంస్థల 'దుర్వినియోగం' విషయంలో కావడం గమనార్హం.
ఇటీవలి కాలంలో సీబీఐ, ఈడీలు జోరుగా తమ పని సాగిస్తున్నాయి. అనేకమంది రాజకీయ నేతలపై కేసులు వేసి, విచారిస్తున్నాయి. అయితే.. విపక్షాలను అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ చేస్తున్న కుట్ర అని అనేక వర్గాలు ఆరోపించాయి. కాంగ్రెస్, టీఎంసీ, శివసేన వంటి విపక్ష పార్టీలు సైతం బీజేపీపై విరుచుకుపడ్డాయి.
Mamata on misuse of CBI 'మోదీకి తెలుసో.. లేదో..!'
తాజాగా.. ఇదే విషయంపై పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీలో ప్రసంగించారు మమతా బెనర్జీ. ఈ క్రమంలో.. సీబీఐ, ఈడీల దుర్వినియోగంలో మోదీ పాత్ర ఉండకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
"సీబీఐ, ఈడీ దుర్వినియోగంలో మోదీ పాత్ర ఉండకపోవచ్చు. బీజేపీలోని ఓ వర్గం దీనికి బాధ్యత వహిస్తోంది," అంటూ అమిత్ షా ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖపై పరోక్ష ఆరోపణలు చేశారు మమతా బెనర్జీ. గతంలో సీబీఐ.. ప్రధాని కార్యాలయానికి రిపోర్టు చేసేదని.. కానీ ఇప్పుడు కేంద్ర హోంశాఖ పరిధిలోకి వెళ్లిందని అన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
TMC vs BJP : 'సొంత పార్టీ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకోకుండా మోదీ చూసుకోవాలి. భారతీయ వ్యాపారవేత్తలు.. సీబీఐ ఒత్తిడి భరించలేక విదేశాలకు వెళ్లిపోతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై ప్రధాని దృష్టిసారించాలి,' అంటూ ప్రవేశపెట్టిన ఆ తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. 189-69 ఓట్ల తేడాతో ఆ తీర్మానం గట్టెక్కింది.
2014 నుంచి బీజేపీపై మమతా బెనర్జీ పోరాటం చేస్తున్నారు. 2022 ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారాలతో పశ్చిమ్ బెంగాల్ దద్దరిల్లింది. ఆ యుద్ధంలో మమతా బెనర్జీ విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా.. విపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో మోదీకి సానుకూలంగా దీదీ తొలిసారి మాట్లాడటం సర్వత్రా చర్చకు దారితీసింది.
అదే కారణమా?
Mamata Banerjee vs Modi : మమతా బెనర్జీ చేసిన తీర్మానాన్ని బీజేపీ వ్యతిరేకించింది. సొంత పార్టీ సభ్యులను సీబీఐ, ఈడీ విచారణల నుంచి రక్షించుకోవడం కోసమే ఆమె ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించింది.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. 'దీదీ- మోదీ మధ్య ఒప్పందం కుదురినట్టు ఉంది. అందుకే ఆమె మోదీకి సానుకూలంగా మాట్లాడుతున్నారు. ఇందతా వ్యూహాత్మకమే,' అని విమర్శించింది.