సీఎం మమతా కామెంట్స్.. ఏపీలో 'పెగాసస్' కలకలం!
18 March 2022, 12:42 IST
- వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ అంశంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్డీ. అప్పట్లో రూ. 25 కోట్లకు అందిస్తామంటూ తమ సర్కార్ కు ప్రతిపాదనలు వస్తే తిరస్కరించామని చెప్పారు. అయితే ఏపీలోని చంద్రబాబు సర్కార్ తీసుకుందన్నారు.
పెగాసస్ పై సీఎం మమతా కామెంట్స్
పెగాసస్ సాఫ్ట్వేర్ను రూ.25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో బెంగాల్లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయన్నారు సీఎం మమతా బెనర్జీ. అయితే ఈ అంశం ప్రజల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయటంతో పాటు... చట్ట విరుద్ధమైనదిగా భావించి తాము కొనలేదని స్పష్టం చేశారు. అయితే నాడు ఏపీలో ఉన్న చంద్రబాబు సర్కార్... ఈ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసిందని వ్యాఖ్యానించారు.
ఏపీలో చర్చ...
టీడీపీ సర్కార్ కొనుగోలు చేసిందంటా మమతా బెనర్జీ చెప్పటంతో.. ఏపీలో చర్చ మొదలైంది. మమతా స్టేట్ మెంట్ పై అలర్ట్ అయిన టీడీపీ నేతలు.. నాడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ఇచ్చిన ప్రకటనను తెరపైకి తీసుకువస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పెగాసెస్ స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయలేదని విషయాన్ని ఆయనే స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కూడా ట్వీట్ కు జత చేస్తున్నారు.
'నాటి చంద్రబాబు ప్రభుత్వం పెగసిస్ సాఫ్ట్ వేర్ కొనలేదని స్వయంగా మీ సవాంగే చెప్పారు జగన్ రెడ్డి. సమాచార హక్కు చట్టం ప్రకారం 25-7-21 న కర్నూలు జిల్లాకి చెందిన నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అసలు అటువంటి సాఫ్ట్ వేర్ ఏదీ కొనలేదని స్వయంగా నాటి డిజిపి సవాంగ్ జవాబునిచ్చారు' అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.
మాజీ మంత్రి జవహర్ తో పాటు టీడీపీ ఎమ్మెల్యే బీటెక్ రవి కూడా స్పందించారు. 'మా దగ్గర పెగసిస్ ఉంటే అబ్బాయిల గొడ్డలి పోటు నుండి బాబాయ్ వివేకాని కాపాడేవాళ్లం కదా! జగన్ రెడ్డి' అంటూ బీటెక్ రవి ట్వీట్ చేశారు.
పెగసస్ వివాదం...
పెగాసస్ వివాదం దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ అనే సంస్థ 'పెగాసస్' స్పైవేర్ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్ను ఎన్ఎస్ఓ పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. నిపుణులు దీన్ని సైబర్ ఆయుధంగా అభివర్ణిస్తుంటారు. 2019లో భారత్లో ఈ స్పైవేర్ కలకలం రేపింది. వాట్సాప్ ద్వారా కొన్ని అజ్ఞాత సందేశాలు వచ్చాయని, వాటితో తమ ఫోన్లలోకి పెగాసస్ను జొప్పించారని కొందరు జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో పోరాడాయి. ఈ అంశం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. దీనిపై ఏర్పాటైన ఓ కమిటీ.. దర్యాప్తు జరుపుతోంది. 2017లో పెగసస్ సాఫ్ట్వేర్ను భారత ప్రభుత్వం 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్టైమ్స్లో వచ్చిన కథనం ప్రకంపనలు రేపింది.