Menstrual pain leave PIL : పీరియడ్స్ సమయంలో మహిళలకు సెలవులు.. పిల్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు!
24 February 2023, 13:01 IST
Menstrual pain leave PIL : పీరియడ్స్ సమయంలో సెలవులు ఇవ్వడం అనే అంశంపై దాఖలైన పిల్ను పక్కనపెట్టింది సుప్రీంకోర్టు. ఇది విధాన పరమైన నిర్ణయం అని, అందుకే మహిళా, శిశు సంక్షేమశాఖను సంప్రదించాలని స్పష్టం చేసింది.
పీరియడ్స్ సమయంలో మహిళలకు సెలవులు.. పిల్ను కొట్టేసిన సుప్రీం
Supreme court Menstrual pain leave : మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగస్తుల పీరియడ్స్ సమయాల్లో సెలవులు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాలని దాఖలైన పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం)ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది ప్రభుత్వాల విధానాల పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఫలితంగా.. ఈ విషయంపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధిశాఖను సంప్రదించాలని స్పష్టం చేసింది.
'ఇది మా పరిధిలోకి రాదు..!'
మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961లోని సెక్షన్ 14కు తగ్గట్టు కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా.. ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి పిల్ దాఖలు చేశారు. ఈ ఒక్క కీలక తీర్పుతో.. మహిళలు, బాలికలు, ఉద్యోగస్థులకు సంబంధించి దాదాపు అన్ని కష్టాలు తీరిపోతాయని అభిప్రాయపడ్డారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. అందుకు అంగీకరించలేదు.
Supreme court on Menstrual pain leaves : "పిటిషనర్.. మహిళా, శిశు సంక్షేమశాఖను సంప్రదించడం ఉత్తమం. అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టాలి. ఈ పిల్ విషయంలో ఇరు వర్గాల్లోనూ సమానంగా పాయింట్లు ఉన్నాయి. ఈ విషయంపై ఎలాంటి న్యాయపరమైన తీర్పులు ఇచ్చినా, అది మహిళలకు మంచిది కాదు అన్న వాదన నిజమే. పీరియడ్స్ కోసం సెలవులు ఇవ్వాలని మేము చెబితే.. సంస్థలు మహిళలనే తీసుకోవడం మానేసే ప్రమాదం ఉంటుంది. అదే సమయంలో.. పీరియట్స్ సమయంలో సెలవులు ఇవ్వాలన్నది కూడా సరైన వాదనే. ఇక ఇది విధానాల పరమైన అంశం. మేము ఈ పిల్ని ముట్టుకోము," అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పరిద్వాలాలు కూడా ఉన్నారు.
కేరళలో సెలవులు..
Kerala Menstrual pain leaves : ఉన్నత విద్యాశాఖ పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లోని విద్యార్థినులు అందరికీ రుతుచక్రం, ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కేరళ ప్రభుత్వం గత నెలలో నిర్ణయించింది. ఇలాంటి మహిళా అనుకూల అడుగు వేయడం దేశంలోనే ఇదే ప్రథమమని, సమాజంలో లింగ న్యాయం జరగాలనే వామపక్ష ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ నాడు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్యలు చేపట్టలాన్న విషయంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.
18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు గరిష్టంగా 60 రోజుల ప్రసూతి సెలవులను అనుమతించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించిందని విజయన్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.