Russia Ukraine war : 75 మిసైళ్లతో ఉక్రెయిన్పై దాడి.. యుద్ధం మరింత తీవ్రం!
10 October 2022, 14:51 IST
- Russia Ukraine war latest news : రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదిరింది. ఉక్రెయిన్పై రష్యా సోమవారం మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ ఘటనల్లో అనేక మంది మరణించినట్టు తెలుస్తోంది.
రష్యా మిసైల్ దాడితో కీవ్ నగరంలో దెబ్బ తిన్న ఓ భవనం
Russia latest attacks on Ukraine : క్రిమియా వంతెనపై దాడి ఘటనకు రష్యా ప్రతీకారం తీర్చుకుంది! యుద్ధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ దేశం.. మిసైల్ దాడులతో అల్లాడిపోయింది. ఉక్రెయిన్లోని అనేక ప్రాంతాల్లో రష్యా సోమవారం దాడులకు పాల్పడింది. తమపై 75మిసైళ్లతో రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
"ఉక్రెయిన్పై మిసైల్ దాడి జరుగుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో క్షిపణులతో దాడులు చేస్తున్నారని సమాచారం ఉంది. ప్రజలు షెల్టర్లలోనే ఉండాలి. బయటకు రాకూడదు. సోమవారం ఉదయం నుంచి 75మిసైళ్లతో దాడి చేశారు," అని ప్రెసిడెంట్ ఆఫీసులోని ఓ అధికారి మీడియాకు వెల్లడించారు.
Russia Missile attack on Kyiv : తాజా దాడిలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ భారీగా దెబ్బతింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:15 గంటలకు కీవ్పై దాడులు మొదలయ్యాయి. పేలుళ్లు జరిగిన ప్రాంతాలకు అంబులెన్స్లు దూసుకెళ్లాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. సోమవారం ఉదయం నుంచి కీవ్లో ఐదుకుపైగా దాడులు జరిగినట్టు సమాచారం.
జూన్ 26 తర్వాత..
క్రిమియాను రష్యాను అనుసంధానం చేసే ఓ వంతెనపై రెండు రోజుల క్రితం పేలుడు జరిగింది. ఆ ఘటనలో వంతెన పాక్షికంగా దెబ్బతింది. వాస్తవానికి ఈ వంతెన రష్యాకు ఎంతో అవసరం. కీలకమైన సైనిక రవాణాలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి. వంతెనపై దాడి ఉక్రెయిన్ పనేనా? అన్నది ఇంకా తెలియరాలేదు. కానీ ఉక్రెయిన్పై పగ తీర్చుకుంటామని రష్యా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే.. సోమవారం మిసైళ్లతో విరుచుకుపడింది.
Russia Ukraine war : కీవ్పై చివరిగా జూన్ 26న దాడులు జరిపింది రష్యా. ఇప్పుడు మళ్లీ ఈ స్థాయిలో పేలుళ్లు జరుగుతుండటం.. సర్వత్రా భయాందోళనకు కారణమవుతోంది. యుద్ధం మరింత తీవ్రమవుతుందన్న భయం అందరిలో నెలకొంది.
మరికొన్ని గంటల్లో భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ తరుణంలో ఉక్రెయిన్వ్యాప్తంగా దాడులు జరుగుతుండటం చర్చకు దారితీసింది.
ఉక్రెయిన్లో తాజా దాడులను ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ఉక్రెయిన్ను భూమి మీద లేకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
"తాజా దాడుల్లో చాలా మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ప్రజలు షెల్టర్లలోనే ఉండాలి. మనల్ని భూమి మీద లేకుండా చేసేందుకు రష్యా కుట్రపన్నుతోంది," అని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
లివ్, టెర్నోపిల్, జోటోమిర్ ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఒక్క కీవ్లోనే.. దాడుల కారణంగా 8మంది మరణించినట్టు, 24మంది గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.