PNB hikes MCLR: ఎంసీఎల్ఆర్ రేటు పెంచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
31 August 2022, 18:33 IST
PNB hikes MCLR: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచింది.
ఎంసీఎల్ఆర్ రేట్లు పెంచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
న్యూఢిల్లీ, ఆగస్టు 31: పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్జినల్ వ్యయ ఆధారిత వడ్డీ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.05 శాతం మేర పెంచింది. అన్ని కాల వ్యవధులపై ఈ పెంపు వర్తిస్తుంది. సెప్టెంబరు 1 నుంచే అమల్లోకి వస్తుంది. ఈ కారణంగా కన్జ్యూమర్ లోన్స్ అన్నీ భారంగా మారనున్నాయి.
కార్ లోన్, పర్సనల్ లోన్ తదితర కన్జ్యూమర్ లోన్స్కు వర్తించే ఏడాది వ్యవధితో కూడిన ఎంసీఎల్ఆర్ రేటు ప్రస్తుతం ఉన్న 7.65 శాతానికి బదులు 7.70 శాతానికి పెరగనుంది. బుధవారం ఈమేరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెబీకి నివేదించింది.
ఇది కూడా చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
ఇక మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 0.05 శాతం పెరిగి 8 శాతానికి చేరనుంది. ఇక ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలల వ్యవధుల ఎంసీఎల్ఆర్ 7.10 శాతం నుంచి 7.40 శాతం మధ్య ఉంటుంది. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.05 శాతంగా ఉండనుంది.
ఆగస్టు నెలారంభంలో ఈ జాతీయ బ్యాంకు రెపో ఆధారిత వడ్డీ రేటును అర శాతం పెంచి 7.90 శాతంగా మార్చింది. ఆగస్టు 6 నుంచి అది అమల్లో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రెపో రేటును పెంచగానే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఆమేరకు వడ్డీ రేట్లను సవరించింది.