Union health min statement on Covid: పార్లమెంట్లో మళ్లీ మాస్క్ లు
22 December 2022, 14:55 IST
Union health min statement on Covid: కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదముందన్న వార్తల నేపథ్యంలో, గురువారం పార్లమెంట్లో సభ్యులు మళ్లీ మాస్క్ లతో కనిపించారు. గత కొంతకాలంగా మాస్క్ లను పక్కనపెట్టిన సభ్యులు, మళ్లీ మాస్క్ లు ధరించడం ప్రారంభించారు.
లోక్ సభలో ప్రకటన చేస్తున్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ
Covid cases decreasing in India: లోక్ సభలో ప్రధాన మంత్రి మోదీ, ఇతర మంత్రులు, సభ్యులు గురువారం మాస్క్ లు ధరించి కనిపించారు. చైనా, అమెరికా, జపాన్, కొరియా, బ్రెజిల్ తదితర దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుండడంతో, పాటు చైనాలో కరోనా కేసుల పెరుగదలకు కారణమైన వైరస్ వేరియంట్ భారత్ లోనూ కనిపించిన నేపథ్యంలో.. పార్లమెంటు ఉభయ సభల్లో మళ్లీ మాస్క్ లతో సభ్యులు కనిపిస్తున్నారు.
Union health min statement on Covid: కేంద్ర మంత్రి ప్రకటన
కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదముందన్న వార్తల నేపథ్యంలో గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్ సభలో ప్రకటన చేశారు. ప్రస్తుతానికి భారత్ కు కోవిడ్ ముప్పు భయమేమీ లేదని, ప్రపంచ దేశాల్లో కేసులు పెరుగుతున్నా, భారత్ లో మాత్రం కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతోందని వివరించారు. అయినా, ముందు జాగ్రత్త చర్యగా, కొత్త వేరియంట్లను వెంటనే గుర్తించేందుకు వీలుగా.. జీనోమ్ సీక్వెన్సింగ్ ను చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజలు కూడా రద్దీ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించడం, సానిటైజర్ వాడడం వంటి కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని సూచించారు.
Pre cautionary dose: బూస్టర్ డోస్..
అలాగే, బూస్టర్ డోస్ వేసుకోవాల్సిన అవసరం ఉన్న వారంతా తప్పకుండా బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ను వేసుకోవాలని సూచించారు. తద్వారా, వైరస్ సోకినా, ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, తగ్గిపోతుందని వివరించారు. వృద్ధులు, మహిళలు, గర్భిణులు, పిల్లలు, డయాబెటిస్, కిడ్నీ, హార్ట్ సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనవసరంగా రద్దీ ప్రదేశాలకు వెళ్లడం చేయవద్దని సూచించారు.
Random testing: ర్యాండమ్ టెస్టింగ్..
విదేశాల నుంచి వస్తున్న వారికి విమానాశ్రయాల్లో ర్యాండమ్ గా కరోనా టెస్ట్ లు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. విదేశీ ప్రయాణీకుల్లో కొందరిని ఎంపిక చేసి, వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ లు చేయడం ప్రారంభించామన్నారు. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి మాండవీయ పార్లమెంటుకు వివరించారు. కోవిడ్ పై పోరాటం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించబోమని, రాష్ట్రాలకు కూడా ఈ విషయంలో తగిన సహకారం అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 220 కోట్ల టీకాలు వేశామని వెల్లడించారు. మరోవైపు, గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కోవిడ్ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.