Karnataka road accident : ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి
05 November 2022, 9:22 IST
- Karnataka road accident : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తున్న ఓ ఆటోను.. ట్రక్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మహిళలు దుర్మరణం
Karnataka road accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్లో శుక్రవారం అర్ధరాత్రి.. ఓ ఆటోను ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులందరు మహిళలే. మరో 11మంది గాయపడ్డారు.
శుక్రవారం పని ముగించుకుని, తమ ఇళ్లకు వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కారు ఆ ఏడుగురు మహిళలు. కాగా.. బీమలఖేడ ప్రభుత్వ స్కూల్ వద్ద.. ఆటోను ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వారందరు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
మృతి చెందిన మహిళలను.. పార్వతి(40), ప్రభావతి(36), గుండమ్మ(60), యాదమ్మ(40), జగ్గమ్మ(34), ఈశ్వరమ్మ(55), రుక్మిణి భాయ్(60)గా గుర్తించారు అధికారులు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు.
మధ్యప్రదేశ్లో..
మధ్యప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నివారీ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి.. ఓ కారు, చెట్టును బలంగా ఢీకొట్టింది. ఓ పార్టీ నుంచి తిరిగొస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
Madhya Pradesh road accident news : ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. కాగా.. చెట్టును ఢీకొట్టిన కారు నుజ్జునుజ్జు అయ్యింది. మృతదేహాలను బయటకు తీసేందుకు దాదాపు 6గంటల సమయం పట్టింది. గ్యాస్ కట్టర్ల సాయంతో కారును కట్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు.
మధ్యప్రదేశ్లో ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదం పెరిగిపోతున్నాయి. . బెతుల్ జిల్లాలో ఓ బస్సును, ఓ కారు ఢీకొట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.. ఈ ఘటనలో 11మంది మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులందరు స్థానికులు. మహారాష్ట్ర అమరావతిలో కూలీలుగా పనిచేసే వీరు.. బెతుల్లోని సొంత గ్రామానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
అంతకముందు.. అక్టోబర్ చివరి వారంలో.. జరిగిన రోడ్డు ప్రమాదంలో 14మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు.