Mangalore auto blast : ‘ఆటో పేలిన ఘటనతో ఉగ్రవాదానికి లింక్!’
20 November 2022, 13:57 IST
Mangalore auto blast : మంగళూరు ఆటో పేలుడు ఘటనతో ఉగ్రవాదానికి లింక్ ఉన్నట్టు అనుమానిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని వివరించారు.
ఘటనాస్థలంలో స్వాధీనం చేసుకున్న కుక్కర్
Mangalore auto blast : కర్ణాటక మంగళూరులో శనివారం జరిగిన ఆటో పేలుడు ఘటన.. సాధారణ విషయం కాదని పోలీసులు వెల్లడించారు. అది.. విధ్వంసం సృష్టించేందుకు జరిగిన ఉగ్రవాద ఘటన అని పేర్కొన్నారు. ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు.
ఉగ్రవాదంలో లింక్లు..!
శనివారం.. మంగళూరులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఓ ఆటో పేలింది. ఆ సమయంలో ఆటోలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు అనంతరం ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. ఈ వ్యవహారం రాష్ట్రంలో కలకలం సృష్టించింది.
Mangalore auto blast latest updates : మంగళూరు ఆటో పేలుడు ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో కలిసి కర్ణాటక పోలీసులు పని చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి అరాగ జ్ఞానేంద్ర వెల్లడించారు.
"ఘటనలో గాయపడిన వ్యక్తులు.. మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఈ ఘటనతో ఉగ్రవాదానికి లింక్ ఉన్నట్టు కనిపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చాము. మంగళూరుకు ఓ బృందం వచ్చింది. ఒకటి, రెండు రోజుల్లో ఈ విషయంపై మరింత సమాచారం లభిస్తుంది," అని హోంమంత్రి స్పష్టం చేశారు.
ఈ విషయంపై మరిన్ని వివరాలను.. కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ మీడియాకు వివరించారు.
Karnataka auto blast incident : "ఘటనాస్థలం నుంచి ఓ కుక్కర్ను స్వాధీనం చేసుకున్నాము. దానికి బ్యాటరీలు అతికించి ఉన్నాయి. ఇక పేలుడు జరిగిన సమయంలో డ్రైవర్తో పాటు ఓ ప్యాసింజర్ ఆటోలో ఉన్నాడు. ప్యాసింజర్ వద్ద ఆధార్ కార్డు ఉంది. అతను హుబ్బలిలో ఉంటాడు. అయితే.. ఆధార్ కార్డులో ఉన్న ఫొటో అతనిది కాదు. దీని బట్టి.. అతను ఏదో ప్రణాళిక రచించాడని అర్థమైంది. ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాడో ఇంకా తెలియదు. ఇటీవలే జరిగిన కోయంబత్తూర్ పేలుడు ఘటనకు, ఇతనికి సంబంధం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేము. అతను కర్ణాటకకు చెందిన వాడే. కానీ గత కొన్ని నెలలుగా ఇతర రాష్ట్రాలకు వెళుతూ వచ్చాడు. కోయంబత్తూర్తో పాటు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తిరిగాడు," అని సూద్ వివరించారు.
Karnataka crime news : మంగళూరు ఆటో పేలుడు ఘటనపై ప్రజలు మౌనంగా ఉండాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాపించకూడదని పోలీసులు పిలుపునిచ్చారు. తాజా పరిణామాలతో ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నట్టు.. త్వరలోనే వివరాలను వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.