తెలుగు న్యూస్  /  National International  /  Diesel Cars With Bs 4 Engine May Get Banned In Delhi-ncr From October This Year

Diesel cars ban: ఆ కార్లు బ్యాన్.. పొల్యూషన్ సర్టిఫికెట్ లేదంటే పెట్రోల్ బంద్

09 August 2022, 14:33 IST

    • Diesel cars ban: ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్య స్థాయిలు 450 AQI దాటితే డీజిల్ కార్లపై నిషేధం అమల్లోకి వస్తుంది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో డీజిల్ బీఎస్4 కార్ల బ్యాన్.. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే వాహనాలకు పెట్రోల్ బంద్
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో డీజిల్ బీఎస్4 కార్ల బ్యాన్.. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే వాహనాలకు పెట్రోల్ బంద్ (AP)

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో డీజిల్ బీఎస్4 కార్ల బ్యాన్.. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే వాహనాలకు పెట్రోల్ బంద్

బీఎస్ 4 ఇంజిన్‌తో నడిచే డీజిల్ కారు కలిగి ఉన్నారా? మీ సమాధానం అవును అయితే మీరు అక్టోబర్ 1, 2022 నుండి ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో దాన్ని నడపలేరు. ఈ దిశగా ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) కొత్త విధానాన్ని రూపొందించింది.

దీని ప్రకారం వాయు కాలుష్య స్థాయి 450 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) మార్కును మించి ఉంటే జాతీయ రాజధాని ప్రాంతంలో BS 4 ఇంజిన్‌తో కూడిన డీజిల్ కార్లను నిషేధించవచ్చు.

దీపావళి బాణాసంచా కాల్చడం, హర్యానా, పంజాబ్‌లలో వరి గడ్డి కాల్చడం వంటి కారణాల వల్ల ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. ఒక్కోసారి ఏక్యూఐ 900లకు పైగా ఉంటుంది. కొత్త విధానంలో భాగంగా ఈ ప్రాంతంలో BS 4 ఇంజిన్‌లతో నడిచే ఫోర్ వీలర్ వాహనాలను నిషేధించనున్నారు.

అలాగే వాయు కాలుష్యం దశ-3కి చేరుకున్నప్పుడు మాత్రమే నిషేధం అమలులోకి వస్తుంది. పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ ఆమోదించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద దశలను వర్గీకరిస్తారు.

AQI 401 నుంచి 450 మధ్య ఉన్నప్పుడు వాయు కాలుష్యం 3వ దశ తీవ్రమైనది గా గుర్తిస్తారు. ‘ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని రాష్ట్ర ప్రభుత్వాలు BS 3 పెట్రోల్, BS 4పై ఆంక్షలు విధించవచ్చు. స్టేజ్ 3 కింద డీజిల్ లైట్ మోటర్ వెహికల్స్ (ఫోర్ వీలర్స్) వస్తాయి..’ అని పాలసీ పేర్కొంది.

AQI 450 మార్కును అధిగమించినప్పుడు వాయు కాలుష్యం 4వ దశకు చేరుకుంటుంది. దీనికి భిన్నమైన కార్యాచరణ ప్రణాళిక ఉంది. వాయుకాలుష్యం 4వ దశకు చేరుకుంటే నగరంలోకి ట్రక్కులు, ఢిల్లీలో రిజిస్టరై డీజిల్‌తో నడిచే మీడియం గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వెహికల్స్ ప్రవేశంపై నిషేధం విధించాలని సదరు ప్రణాళిక సూచిస్తోంది. అయితే నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే వాహనాలకు మాత్రం నిషేధం నుంచి మినహాయింపు ఉంటుంది.

ఈ పాలసీ తీసుకురావాలని యోచిస్తున్న మరో ప్రధాన మార్పు ఏమిటంటే.. చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోలు, డీజిల్ పోయడానికి ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో పెట్రోలు పంపులను నిరోధించడం. ఇది జనవరి 1, 2023 నుండి అమలులోకి వస్తుంది.

టాపిక్