కాలుష్య రాజధాని నగరాల్లో నెంబర్ 1గా ఢిల్లీ
2021లో ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం గల రాజధాని నగరంగా నిలిచింది. దేశంలో ఏ ఒక్క నగరమూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుగుణంగా ఎయిర్ క్వాలిటీ ప్రమాణాలు సాధించలేకపోయింది.
న్యూఢిల్లీ: వరుసగా నాలుగోసారి 2021లో కూడా ఢిల్లీ ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం గల రాజధాని నగరంగా నిలిచింది. అలాగే దేశంలోని 50 నగరాల్లో 35 నగరాలు అత్యధికంగా కాలుష్య ప్రభావం ఎదుర్కొంటున్నాయని ఒక నివేదిక వెల్లడించింది.
ట్రెండింగ్ వార్తలు
2021లో దేశంలోని ఏ ఒక్క నగరమూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన వాయు నాణ్యత ప్రమాణాలను కలిగి లేదని స్విస్ ఆర్గనైజేషన్ ఐక్యూఎయిర్ రూపొందించిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్-2021 వెల్లడించింది. ఈ నివేదిక మంగళవారం విడుదలైంది.
117 దేశాల్లోని 6,475 నగరాల్లో పీఎం2.5 ఆధారంగా ఎయిర్ క్వాలిటీ గణాంకాలను క్రోఢీకరించి ఈ నివేదికను ఆ సంస్థ రూపొందించింది.
అత్యంత కలుషిత రాజధాని నగరాల్లో ఢిల్లీ తర్వాత ఢాకా రెండో స్థానంలో ఉండగా, చాద్లోని ఎన్జమెనా, తజికిస్థాన్లోని దుషాన్బే, ఒమన్లోని మస్కట్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని నివేదిక పేర్కొంది.
న్యూఢిల్లీలో పీఎం 2.5 సాంద్రతలు 2021లో 14.6 శాతం పెరిగాయి. 2020లో క్యూబిక్ మీటరుకు 84 మైక్రోగ్రాముల నుంచి 96.4 మైక్రోగ్రాములకు పీఎం స్థాయి పెరిగిందని నివేదిక పేర్కొంది.
‘భారతదేశం కూడా అత్యంత కలుషితమైన నగరాల్లో ఒకటిగా ఉంది. మొదటి 50 అత్యంత కలుషిత నగరాల్లో 35 ఈ దేశంలోనే ఉన్నాయి..’ అని నివేదిక పేర్కొంది.
‘ప్రజలు ప్రమాదకరమైన, కలుషితమైన గాలిని పీల్చుకుంటున్నారని ఇది మరోసారి స్పష్టం చేస్తోంది. పట్టణ పీఎం 2.5 సాంద్రతలకు దోహదపడేవాటిలో వాహన ఉద్గారాలు ప్రధానంగా నిలుస్తున్నాయి..’ అని నివేదిక వెల్లడించింది.
‘భారతదేశంలో ఏటా వాహన విక్రయాలు పెరుగుతాయని భావిస్తున్నందున, సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోతే అది ఖచ్చితంగా వాయు నాణ్యతపై ప్రభావం చూపుతుంది’ అని గ్రీన్ పీస్ సంస్థ క్యాంపేయిన్ మేనేజర్ చంచల్ చెప్పారు.
వాయు కాలుష్యం మానవ ఆరోగ్యంపై భారీ ప్రభావాన్ని చూపుతుందని, వేగవంతమైన వాతావరణ విపత్తుకు ప్రధాన సూచిక అని ఆయన నొక్కి చెప్పారు.