Actresses Remuneration: బాలీవుడ్ భామలంటే భారీగా సమర్పించిల్సిందే..! ఎన్టీఆర్ సినిమాకు జాన్వీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
07 March 2023, 9:10 IST
- Actresses Remuneration: టాలీవుడ్లో సినిమా చేసేందుకు బాలీవుడ్ ముద్దుగుమ్మలు భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. ఎన్టీఆర్ 30 కోసం జాన్వీ కపూర్ దాదాపు రూ.5 కోట్ల వరకు పారితోషికం అడిగిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
బాలీవుడ్ భామలకు భారీ రెమ్యూనరేషన్
Actresses Remuneration: టాలీవుడ్లో హీరోల రెమ్యూనరేషన్ ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంటుంది. కచ్చితంగా ఇంతనే చెప్పలేము కానీ స్టార్ హీరో అంటే భారీగా సమర్పించాల్సిందే. అయితే ఇటీవల కాలంలో హీరోయిన్లు కూడా పారితోషికం విషయం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. అందులోనూ బాలీవుడ్ భామలను మన సినిమాల్లో కథానాయికలుగా తీసుకుంటే రెమ్యూనరేషన్(Remuneration) ఇంకా ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న NTR30లో జాన్వీ కపూర్ను(Janhvi Kapoor) హీరోయిన్గా కన్ఫార్మ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ కూడా ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట.
తన ఫెవరెట్ యాక్టర్ ఎన్టీఆర్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం ఆత్రుతగా చూస్తున్నానంటూ పేర్కొన్న జాన్వీ.. పారితోషికం విషయంలోనూ అంతే కచ్చితంగా ఉంటోంది. NTR30 సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ దాదాపు రూ.5 కోట్ల వరకు రెమ్యూరేషన్ తీసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. భారీ పారితోషికంతో ఆమెను మేకర్స్ కన్విన్స్ చేశారట.
ఒక్క జాన్వీ కపూర్నే కాదు.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎవరు సౌత్లో నటించినా రెమ్యూనరేషన్ మాత్రం భారీగా మూటజెప్పాలట. శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న RC15లో కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా కోసం రూ.4 కోట్లు డిమాండ్ చేసిందట. అదనంగా జీఎస్టీ కూడా ఇచ్చేలా మేకర్స్తో ఒప్పందం కుదుర్చుకుందట.
దీన్ని బట్టి చూస్తుంటే మన అగ్ర హీరోల పక్కన బాలీవుడ్ ముద్దుగుమ్మలను నటింపజేయాలంటే కనీసం రూ.5 కోట్ల వరకు నిర్మాతలు పెట్టుబడి పెట్టాల్సిందేనని తెలుస్తోంది. దీంతో టాప్ హీరోయిన్లకు డిమాండ్ ఓ రేంజ్లో నెలకొంది.
మరో పక్క టాలీవుడ్ హీరోయిన్లు కూడా అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. తెలుగులో కథానాయికలు సగటున సినిమాకు వారి వారి మార్కెట్ను బట్టి కోటి రూపాయల నుంచి రూ. 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. ఇదే బాలీవుడ్ హీరోయిన్లను తీసుకుంటే రూ.5 కోట్ల వరకు సమర్పించుకోవాల్సందే. ప్రాజెక్టు కే సినిమా కోసం దీపికా పదుకుణేకు ఏకంగా రూ.10 కోట్ల వరకు పారితోషికంగా ఇస్తున్నారని సమాచారం.