DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్; డీఏ పెంపునకు కేంద్రం నిర్ణయం
24 March 2023, 21:49 IST
DA hike to central govt employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యం (dearness allowance DA) మరో 4% పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ప్రతీకాత్మక చిత్రం
DA hike to central govt employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యం (dearness allowance DA) మరో 4% పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు. తాజా 4% పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 42 శాతానికి పెరిగింది. ఈ డీఏ పెంపు మొత్తాన్ని ఈ సంవత్సరం జనవరి నుంచి ఉద్యోగులకు అందుతుంది.
DA hike to central govt employees: రూ. 12 వేల కోట్ల భారం
ఈ 4% డీఏ పెంపుతో ప్రభుత్వంపై రూ. 12,815 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 38% ఉంది. తాజాగా, పెంచిన 4 శాతంతో కలుపుకుని ఈ డీఏ 42 శాతానికి పెరుగుతుంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరల భారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తుంటారు. పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (consumer price index for industrial workers CPI-IW) ఆధారంగా ప్రతీ ఏటా రెండు సార్లు డీఏను సమీక్షిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ (DA) పేరుతో, పెన్షనర్లకు డియర్ నెస్ రిలీఫ్ (DR) పేరుతో ఇది అందిస్తారు.
DA hike to central govt employees: 47 లక్షల ఉద్యోగులు..
ఈ డీఏ పెంపుతో మొత్తం 47.58 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అలాగే, 69.76 లక్షల మంది పెన్షనర్లు కూడా ఈ ప్రయోజనాన్ని పొందుతారు. ఏడవ వేతన సంఘం (7th Central Pay Commission) సిఫారసుల మేరకు ఈ డీఏ పెంపు ప్రయోజనాలను అందిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది.
DA hike to central govt employees: సబ్సీడీ కొనసాగింపు
డీఏ పెంపు నిర్ణయంతో పాటు, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద అందించే సబ్సీడీని మరో సంవత్సరం పాటు పొడగించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అలాగే, జనుము (jute) కనీస మద్దతు ధరను రూ. 300 పెంచుతున్నట్లు తెలిపారు.