Tirumala Temple Assets: శ్రీవారి ఆస్తులెంతో తెలుసా …? టీటీడీ తాజా లెక్కలివే
05 November 2022, 17:02 IST
- Tirumala Temple Assets latest: తిరుమల శ్రీవారి ఆస్తులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం
Assets of Tirumala Temple: కొద్దిరోజులుగా తిరుమల శ్రీవారి ఆస్తులపై చర్చ జరుగుతోంది. ఆలయ ఆస్తులను పక్కదోవ పట్టిస్తున్నారని... ఏపీ ప్రభుత్వానికి దాదారత్తం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీనిపై అనేక వార్తలు... సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై క్లారిటీ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏకంగా శ్వేతపత్రం విడుదల చేశారు. టీటీడీ ఆస్తులెన్ని..?ఏ బ్యాంకుల్లో ఎంత నగదు ఉంది..? బంగారం డిపాజిట్లు ఎన్ని..? వంటి ప్రశ్నలపై వివరణ ఇచ్చింది. ఈ మేరకు శనివారం టీటీడీ అధికారులు... శ్వేతపత్రం విడుదల చేశారు.
జూన్ 30, 2019 ఏడాది నాటికి ఉన్న ఆస్తులతో పాటు... 30 సెప్టెంబర్ 2022 వరకు ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో 2019 జూన్ వరకు 10.20 కోట్ల రూపాయలు, 2022 సెప్టెంబర్ నాటికీ 5358.11 కోట్ల రూపాయలు, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియాలో 2019 జూన్ వరకు 288.19 కోట్ల రూపాయలు, 2022 సెప్టెంబర్ నాటికి 1694.25 కోట్ల రూపాయలు, బ్యాంక్ అఫ్ బరోడా 2019 జూన్ వరకు రూ.1956.53 కోట్లు, 2022 సెప్టెంబర్ నాటికీ 1839.36 కోట్లు ఉన్నాయని పేర్కొంది. వీటితో పాటు పలు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ల వివరాలను తెలిపారు.
శ్రీవారి ఆలయ మొత్తం బంగారం 10,258 కేజీలు ఉందని అధికారులు ప్రకటనలో తెలిపారు. 2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ. 15,938 కోట్లుకు చేరినట్టుగా టీటీడీ వెల్లడించింది. 2019 జూన్ నాటికి 7,339.74 కేజీల బంగారం నిల్వలు ఉండగా.. ఇప్పుడు 10,258. 37కి చేరిందని ప్రస్తావించింది.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని.. అవన్నీ ఫేక్ అని ప్రకటనలో టీటీడీ స్పష్టం చేసింది. అత్యంత పారదర్శకంగా శ్రీవారి ఆస్తుల నిర్వహణ ఉందని స్పష్టం చేశారు. కరోనా సమయంలో తిరుమల ఆదాయం తగ్గిందని చెప్పుకొచ్చారు.