Tirumala Break Darshan: శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
Tirumala Break Darshan: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. భక్తుల ఇబ్బందులను గుర్తించి.. బ్రేక్ దర్శనాల విషయంలో మార్పులు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ttd on break darshan at tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ. సామాన్య భక్తుల సౌకర్యార్థం దృష్ట్యా బ్రేక్ దర్శనల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి టైం స్లాట్ అమలు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకే... బ్రేక్ దర్శన సమయంలో మార్పులు తీసుకోవస్తున్నట్లు పేర్కొన్నారు.
తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో టీటీడీ ఛైర్మన్, ఈవోతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజూ 20వేల నుంచి 25 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15వేల టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 12న తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశామని గుర్తు చేశారు. భక్తుల విజ్ఞప్తి మేరకు వీటిని తిరిగి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గల రెండో సత్రంలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని వివరించారు. శని, ఆది, సోమ, బుధవారాల్లో 20 వేల నుండి 25 వేల టోకెన్లు, మంగళ, గురు, శుక్రవారాల్లో 15 వేల టోకెన్లు భక్తులకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఏ రోజు దర్శనానికి సంబంధించిన టోకెన్లు అదేరోజు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. కోటా పూర్తవగానే కౌంటర్లు మూసివేస్తామని వివరించారు.
ఈ కౌంటర్లలో కంప్యూటర్లు, కెమెరాలు, ఆధార్ నమోదు వ్యవస్థ, తాగునీరు, క్యూలైన్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. టోకెన్లు దొరకని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు.
బ్రేక్ దర్శన సమయం మార్పు
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తామని ఈఓ తెలిపారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం అమలు చేస్తామన్నారు. ఈ కారణంగా భక్తులు ఏరోజుకు ఆరోజు తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉందని, తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.
శ్రీవాణి ట్రస్ట్ దాతలకు తిరుపతిలోని మాధవంలో గదులు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఈవో వెల్లడించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఆఫ్ లైన్ టికెట్లు కూడా మాధవంలోనే మంజూరు చేస్తామన్నారు.