TTD: వేగంగా టైం స్లాట్ టోకెన్లు జారీ చేయండి
శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ ఉన్నతాధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. టైం స్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియను మరింత వేగంగా చేసేలా చూడాలని టీటీడీ ఈవో జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు.
tirumala time slot tokens: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత వేగంగా, సౌకర్యవంతంగా టైంస్లాట్ టోకెన్లు జారీ చేయాలన్నారు టీటీడీ ఈవో కెఎస్ జవహర్ రెడ్డి. ఇందుకోసం పటిష్టమైన కార్యాచరణ రూపొందిచాలని ఆదేశించారు. తిరుపతిలోని సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను పరిశీలించిన ఆయన.. పలు సూచనలు చేశారు. అన్నప్రసాదాలు అందించేందుకు, అవసరమైన చోట్ల షెల్టర్ల ఏర్పాటు, భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో మార్పులు తదితర అంశాలపై చర్చించారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో భక్తుల క్యూలైన్లు, లగేజీ డిపాజిట్ కౌంటర్లు, స్కానింగ్ యంత్రాలను పరిశీలించారు. అక్కడి ఉచిత వైద్యశాలలో భక్తులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఇందులో ఈవోతో పాటు అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, అదనపు సీవీఎస్వో శివకుమార్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
మరోవైపు జులై నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి.. టికెట్లు బుక్ చేసుకోవాలని.. కోరింది. దర్శనానికి వచ్చే భక్తులు.. కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరింది.
ఇక టీటీడీ శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు కర్ణాటక రాష్ట్రంలో శ్రీనివాస కల్యాణం జరగనుంది. చిక్కబల్లాపూర్ జిల్లా గుడిబండ తాలూకాలో దిన్నహల్లిలోని పాతాళేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో వేడుక నిర్వహించనున్నారు. శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్