Jagananna Vidya Deevena : విద్యార్థులకు గుడ్న్యూస్.. తల్లుల ఖాతాల్లోకి రేపే నగదు జమ
18 March 2023, 17:12 IST
- CM Jagan NTR District Tour: ఆదివారం సీఎం జగన్ ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. తిరువూరులో జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు.
ఆదివారం ఎన్టీఆర్ జిల్లాకు ముఖ్యమంత్రి జగన్
CM Jagan NTR District Tour Updates: విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. ప్రతి ఏటా అందిస్తున్న జగనన్న విద్యా దీవెన.. నాల్గో విడత నగదు ఆదివారం(మార్చి 19) రోజున తల్లుల ఖాతాలో జమ చేయనుంది. ఈ మేరకు ఏపీ సీఎం జగన్... రేపు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. తిరువూరులో ఏర్పాటు చేసే సభలో పాల్గొని... బటన్ నొక్కి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు.
11 లక్షల మంది తల్లుల ఖాతాలోకి...
జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారు. 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 700 కోట్ల రూపాయలు జమ అవుతాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా... పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. మరోవైపు పార్టీ ముఖ్య నేతలు కూడా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ప్రభుత్వం సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.
విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తోంది. ఇప్పటికవరకు మూడున్నర సంవత్సరాలుగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మూడున్నర సంవత్సరాల కాలంలోనే జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా రూ.9052 కోట్లు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా రూ.3349 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో పెట్టిన బకాయిలు సైతం తీరుస్తూ... కేవలం ఈ రెండు పథకాలకు రూ.12,401 కోట్లు ఖర్చుపెట్టింది. 2022 జూలై నుంచి సెప్టెంబరు వరకు సంబంధించిన మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ అంటే... జగనన్న విద్యా దీవెన డబ్బును 11.02 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరేలా రూ.694 కోట్లు పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. ఇందులో భాగంగా రేపు కూడా నాల్గొ విడత విద్యా దీవెన నిధులను జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్.