Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... తిరుమలలో ఈ 3 రోజులు పలు సేవలు రద్దు-the annual vasanthotsavam in tirumala will be observed from april 21 to 23 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... తిరుమలలో ఈ 3 రోజులు పలు సేవలు రద్దు

Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్... తిరుమలలో ఈ 3 రోజులు పలు సేవలు రద్దు

Tirumala Tirupati Devasthanams News : ఏప్రిల్ 21 నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ 3 రోజులపాటు.. పలు రకాల సేవలను టీటీడీ రద్దు చేసింది.

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

Vasanthotsavam in Tirumala 2024 : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు(Vasanthotsavam) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ.

  • ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
  • ఇక 2వ రోజు ఏప్రిల్ 22న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. ఆ తర్వాత…. వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
  • చివరిరోజు ఏప్రిల్ 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.

పలు సేవలు రద్దు…..

వసంతోత్సవాల సందర్భంగా… ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఒంటిమిట్టలో శ్రీవారిలో లడ్డూలను పంపిణీ చేయనున్న TTD

Sri Rama Navami Brahmotsavam at Vontimitta : ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల‌ కల్యాణానికి(Vontimitta Brahmotsavam) ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. అక్కడికి విచ్చేసే భ‌క్తుల‌కు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు కూడా రెడీ అయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 1లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో మినీ (25 గ్రాముల) లడ్డూల ప్యాకింగ్‌ను శుక్ర‌వారం నిర్వహించారు. దాదాపు 250 మంది మహిళా, పురుష శ్రీ‌వారి సేవ‌కులు 1.20 ల‌క్ష‌ల లడ్డూలను 60 వేల జిప్‌లాక్‌ ప్యాకెట్లలో ఒక్కో ప్యాక్‌లో రెండు లడ్డూలు ఉంచారు.

కడపజిల్లా ఒంటిమిట్టలో(Vontimitta Brahmotsavam 2024) ఏప్రిల్ 22వ శ్రీ సీతా రాముల‌ కల్యాణం వైభవంగా జరగనుంది. సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల మధ్య అత్యంత వైభ‌వంగా జరిగే రాష్ట్ర పండుగ శ్రీ సీతా రాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు.