Vasanthotsavam in Tirumala 2024 : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు(Vasanthotsavam) ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ.
ఈ వసంతోత్సవాల సందర్భంగా… ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
Sri Rama Navami Brahmotsavam at Vontimitta : ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కల్యాణానికి(Vontimitta Brahmotsavam) ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. అక్కడికి విచ్చేసే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు కూడా రెడీ అయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 1లో శ్రీవారి సేవకుల సహకారంతో మినీ (25 గ్రాముల) లడ్డూల ప్యాకింగ్ను శుక్రవారం నిర్వహించారు. దాదాపు 250 మంది మహిళా, పురుష శ్రీవారి సేవకులు 1.20 లక్షల లడ్డూలను 60 వేల జిప్లాక్ ప్యాకెట్లలో ఒక్కో ప్యాక్లో రెండు లడ్డూలు ఉంచారు.
కడపజిల్లా ఒంటిమిట్టలో(Vontimitta Brahmotsavam 2024) ఏప్రిల్ 22వ శ్రీ సీతా రాముల కల్యాణం వైభవంగా జరగనుంది. సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల మధ్య అత్యంత వైభవంగా జరిగే రాష్ట్ర పండుగ శ్రీ సీతా రాముల కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు.