Revanth reddy On MLAs Trap: తొందరపడి ఒక కోయిల ముందే కూసింది..
27 October 2022, 10:25 IST
- 4 MLAs Trap in Telangana: అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ వ్యవహరంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు.
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫొటో)
revanth reddy tweet on trs mlas trap: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా జరిగిన ఈ వ్యవహరంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది అధికార టీఆర్ఎస్. మరోవైపు బీజేపీ నేతలు కూడా తీవ్ర స్పందిస్తున్నారు. ప్రగతి భవన్ ప్లానే అమలు చేశారని విమర్శిస్తోంది. తాజా వ్యవహరంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పందించారు.
తమతో పలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్రావు మీడియాతో మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ట్వీట్ చేశారు. ఆ పార్టీ కొనుగోళ్లపై తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ లో రాసుకొచ్చారు.
టీఆర్ఎస్ నిరసనలు…
మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటనపై టీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా టీఎర్ఎస్ నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు అధికార TRS పార్టీకి చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రస్తతం ప్రగతి భవన్ లోనే ఉన్నారు. వారు ఇవాళ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఫామ్ హౌజ్ కొనుగోళ్ల వ్యవహారాన్ని కేసీఆర్ డ్రామాగా బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు.ఈ వ్యవహారానికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేస్తోంది. కేసీఆర్ యాదాద్రి నర్సింహ స్వామిపై ఒట్టేసి చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఆడియో, వీడియో టేపులను బయటపెట్టాలని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని చెబుతున్నదంతా ప్రగతిభవన్ ప్లాన్ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక కోసం ఇంత డ్రామా అవసరమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు చెబుతున్న పేర్లను తొలిసారి వింటున్నామని వ్యాఖ్యానించారు.
రూ. 400 కోట్ల రూపాయలతో నలుగురు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే భారీ డీల్ను హైదరాబాద్ పోలీసులు బుధవారం భగ్నం చేసిన విషయం తెలిసిందే. మధ్యవర్తులను మొయినాబాద్ ఫామ్హౌజ్లో సాక్ష్యాధారాలతో సహా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.