Bandi Sanjay on Police Jobs: EWS అభ్యర్థులకు మినహాయింపు ఎందుకు ఇవ్వలేదు?
09 October 2022, 12:33 IST
Bandi Sanjay Letter to CM KCR: సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ రాశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నియమాకాల్లో ఈడబ్యూఎస్ అభ్యర్థులకు కూడా మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ (ఫైల్ ఫొటో)
సప్లిమెంటరీ నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ మార్కుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మినహాయింపు ఇవ్వగా... ఈడబ్యూ ఎస్ అభ్యర్థులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన సంగతిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరువల్ల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని తెలిపారు.
ఈడబ్యూఎస్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వకపోవడంతో జనరల్ అభ్యర్థుల మాదిరిగా ప్రిలిమ్స్ లో 60, అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చినవారు మాత్రం మెయిన్స్ కు అర్హులు అవుతారని.. ఫలితంగా చాలా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. తక్షణమే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా కటాఫ్ మార్కుల్లో మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను సవరించాలని కేసీఆర్కు రాసిన లేఖలో బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈడబ్యూెస్ అభ్యర్థులు మెయిన్స్ రాసేందుకు ప్రిలిమ్స్ లో 50 మార్కలు కటాఫ్ గా నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Telangana Police Recruitment Cut Off marks Reduced: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన వారికి కటాఫ్ మార్కులు తగ్గిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు (TSLPRB) సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సబ్ ఇన్స్పెక్టర్, టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 30% మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హత సాధిస్తారని ప్రకటించింది.
గత నియామకాల సమయంలో జనరల్ కేటగిరీకి 40%, బీసీ అభ్యర్థులకు 35%, ఎస్సీలకు30% కటాఫ్గా మార్కులుగా ప్రకటించారు. ఈసారి జనరల్ కేటగిరీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలకు సైతం 30 శాతం మార్కులను కటాఫ్గా ఫైనల్ చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో కటాఫ్ తగ్గిస్తూ కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. జనరల్ కేటగిరీకి కటాఫ్ మార్కులు 10% తగ్గడంతో మిగతా కేటగిరీలకూ కటాఫ్ తగ్గిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థలకు మాత్రం తాజా నిర్ణయాన్ని వర్తింపచేయటం పట్ల ఈడబ్యూఎస్ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కూడా వస్తున్నాయి.