Ponnam Prabhakar Letter : బండి సంజయ్ కి పొన్నం ప్రభాకర్ లేఖ
Jagtial To Warangal National Highway : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. జగిత్యాల నుండి వరంగల్ వరకు నిర్మించనున్న నేషనల్ హైవే 563 నిర్మాణంపై లేఖలో ప్రస్తావించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్వార్థ ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని ఆరోపించారు పొన్నం.
జగిత్యాల నుండి వరంగల్ నేషనల్ హైవేపై బండి సంజయ్ కి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) లేఖ రాశారు. ప్రయాణ భారం పెరిగేలా.. నిర్మాణం జరుగుతుందని ఆరోపించారు. వినోద్ కుమార్.. తన సొంత ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోపించారు. లేఖలో పొన్నం ఇంకా ఏం రాశారంటే..?
జగిత్యాల నుండి వరంగల్ వరకు నిర్మించనున్న నేషనల్ హైవే(National Highway) 563 నిర్మించాలనుకున్నారు. 2014లో నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను. జగిత్యాల నుండి వరంగల్(Warangal) వరకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని ప్రతిపాదన వచ్చింది. తద్వారా కరీంనగర్ జిల్లా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందనే ఆలోచనతో జగిత్యాల నుండి వెలిచాల-పద్మనగర్ ఉజ్వల పార్కు రోడ్డు-అలుగునూరు బ్రిడ్జి నుండి మానకొండూరు మీదుగా వరంగల్ వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టుటకు అనుమతి వచ్చింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కమిటీ ఛైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్(Vinod Kumar) తాను పార్లమెంటు సభ్యులుగా ఉన్న సమయంలో తన సొంత ప్రయోజనాల కోసం చూశారు. జగిత్యాల నుండి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి- నగునూరు- ప్రతిమ వైద్య కళాశాల సమీపం నుండి ఎలబోతారం- మానకొండూర్ మీదుగా వరంగల్(Warangal) వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీని వల్ల వల్ల జరిగే పరిణామాలపై ఆలోచన చేయాలి. ఇప్పటికే రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ తరుణంలో ప్రజలకు రవాణా భారం పెరుగుతుండటం, దురదృష్టవశాత్తు ఎవరైనా ప్రమాదాలకు గురైతే అత్యవసర పరిస్థితుల్లో సమయం వృథా అవుతుంది. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు(Farmers) తమ భూములను కోల్పోయి నష్టపోవడమే కాకుండా రోడ్డు నిర్మాణ వ్యయం పెరిగి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది.
అయితే పాత అలైన్ మెంట్ మార్పు విషయంలో వినోద్ కుమార్ ప్రమేయం ఏమీ లేదని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు ప్రమేయం వల్లనే మార్పు చేయడం జరిగిందని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అంటున్నారు. కానీ వినోద్ కుమార్ ప్రమేయం వల్లనే మార్పులు చేయడం జరుగుతుందని కొత్తపల్లి జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యులు జమీలోద్దిన్ చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు మీకు అందజేస్తు్న్నాం.
ఈ పరస్పర ఆరోపణల పట్ల కరీంనగర్ ( Karimnagar) పార్లమెంట్ సభ్యులుగా మీరు స్పందించవలసిన అవసరం ఉంది. వాస్తవాలు ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. పాత అలైన్మెంట్ ప్రకారం కరీంనగర్ శివారులో నూతనంగా నిర్మిస్తున్న తీగల వంతెన మీదుగా నూతన జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడం వల్ల, కరీంనగర్ పట్టణ ప్రజలకు, సమీప గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కొన్ని కిలోమీటర్ల మేర వరకు ప్రయాణ భారం తగ్గుతుంది. జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుంది. కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్న వినోద్ కుమార్ వ్యవహారం పట్ల మీరు తక్షణమే విచారణ జరిపించాలి. ఎలాంటి మార్పులు చేయకుండా గతంలో ఆమోదం పొందిన అలైన్మెంట్ ప్రకారమే నూతన జాతీయ రహదారి నిర్మాణం జరిగేలా చూడాలి.