Bharat Jodo Yatra day 12: డీజిల్ పెరుగుదలపై మత్స్యకారులతో రాహుల్ గాంధీ చర్చ
Bharat Jodo Yatra day 12: భారత్ జోడో యాత్ర సోమవారానికి 12వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం కేరళలోని అలప్పుజ ప్రాంతంలో యాత్ర సాగుతోంది.
అలప్పుజ (కేరళ) సెప్టెంబర్ 19: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం కేరళ రాష్ట్రం అలప్పుజా ప్రాంతంలోని వడకల్ బీచ్లో మత్స్యకారులతో సంభాషించారు. పార్టీ భారత్ జోడో యాత్ర 12వ రోజు ప్రారంభించడానికి ముందు వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు.
పెరుగుతున్న ఇంధన ధరలు, తగ్గిన సబ్సిడీలు, తగ్గుతున్న చేపల నిల్వలు, అందుబాటులో లేని విద్యావకాశాలు, పర్యావరణ విధ్వంసం వంటి ఇతర సమస్యలపై చర్చలు జరిపారు. సామాజిక సంక్షేమం, పెన్షన్లు లేకపోవడం వంటి అంశాలపై కూడా చర్చించారు.
ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కేరళలో సాగుతోంది. మరో 12 రోజుల పాటు రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది.
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర 150 రోజుల్లో పూర్తవుతుంది. 12 రాష్ట్రాలను కవర్ చేస్తుంది. కేరళ నుండి సెప్టెంబర్ 30న కర్నాటకకు చేరుకుంటుంది. భారత్ జోడో యాత్ర 21 రోజుల పాటు కర్ణాటకలో సాగుతుంది. పాదయాత్ర ప్రతిరోజూ 25 కి.మీ.ల పాటు సాగుతోంది.
కేరళలోని కొల్లంలో కూరగాయల వ్యాపారి నుండి స్థానిక కాంగ్రెస్ నాయకులు విరాళాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపించిన వీడియో బయటకు రావడంతో యాత్ర వివాదంలో చిక్కుకుంది. భారత్ జోడో యాత్రకు నిధుల సేకరణకు రూ. 2,000 ఇవ్వనందుకు కొల్లాంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూరగాయల దుకాణదారుని బెదిరించారు.
బీజేపీ విభజన రాజకీయాలను ఎదుర్కోవడానికి, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, రాజకీయ కేంద్రీకరణ ప్రమాదాల నుండి దేశ ప్రజలను మేల్కొల్పడానికి భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.
మతం, వర్గాలకు అతీతంగా భారతీయులను ఏకతాటిపైకి తీసుకురావడమే భారత్ జోడో యాత్ర లక్ష్యం అని, ఇది ఒకటే దేశమని, ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉంటేనే విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
యాత్రలో బహిరంగ సభలు కూడా ఉన్నాయి. భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాబోయే ఎన్నికల పోరాటాల కోసం పార్టీ శ్రేణులను సమీకరించే ప్రయత్నంగా భారత్ జోడో యాత్రను విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.