India vs Australia 2nd test: ఆసీస్ బ్యాటర్ల షాట్ సెలక్షన్పై భారత మాజీ చురకలు.. అలా ఆడితే పనికాదని వెల్లడి
20 February 2023, 8:50 IST
- India vs Australia 2nd test: రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ల షాట్ సెలక్షన్పై భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా స్పందించాడు. విదేశీ బ్యాటర్లు ఎక్కువగా స్వీప్ షాట్లు ఎంపిక చేసుకుంటారని, కానీ భారత ఆటగాళ్లు అలా చేయరని స్పష్టం చేశారు.
భారత్-ఆస్ట్రేలియా
India vs Australia 2nd test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తొలి టెస్టును గుర్తు చేస్తూ మూడు రోజుల్లోనే ఓటమి అంచున నిలిచింది. దిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఒకానొక సమయంలో పటిష్ఠ స్థితిలో కనిపించిన ఆసీస్.. ఆదివారం ఉదయానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 52 పరుగుల వ్యవధిలోనే 9 కీలక వికెట్లు కోల్పోయి పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఆసీస్ బ్యాటర్లపై సర్వత్రా విమర్శలు ఎదురువుతున్నాయి. ముఖ్యంగా వారి షాట్ సెలక్షన్ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై భారత మాజీ ఆకాశ్ చోప్రా స్పందించాడు.
"స్పిన్ బౌలింగ్లో ఆడటానికి ఓ మార్గం ఉంది. విదేశీ జట్లు భారత్లో ఆడేందుకు వచ్చినప్పుడు.. వారు ఎక్కువగా స్వీప్ షాట్లు మాత్రమే ఆడేవారు. కానీ మీరెప్పుడైనా గమనిస్తే.. భారత క్రికెట్లో గత 20 ఏళ్ల కాలంలో స్వీప్ షాట్లు సరిగ్గా ఆడలేదు. సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పుజారా, అజింక్య రహానే లాంటి ఆటగాళ్లకు స్వీప్ షాట్ సరిగ్గా ఆడటం రాదు. రోహిత్ శర్మ మినహా మిగిలిన వారు స్వీప్ షాట్ ఆడరు. అయినా పరుగులు చేస్తూనే ఉన్నారు. పుజారా స్వీప్ షాట్ ఆడటం మీరెప్పుడైనా చూశారా?" అని ఆకాష్ చోప్రా ప్రశ్నించారు.
"తరచూ స్వీప్ షాట్ ఆడుతుంటే అప్పుడు కాకపోయినా.. తర్వాత అయిన ఔట్ అయ్యే ప్రమాదముంటుంది. కాబట్టి పదే పదే స్వీప్ షాట్ ఆడటం కరెక్ట్ కాదు. ఆంగ్లంలో స్వీప్(Sweep) S అనే అక్షరంతో మొదలవుతుంది. ఆ షాట్ ఆడినప్పుడు S పోయి మిగిలిన వీప్(Weep) మిగులుతుంది. అంటే స్వీప్ షాట్ ఆడితే అది మిమ్మల్ని బాధిస్తుందని అర్థం చేసుకోవాలి" అని ఆకాష్ చోప్రా ఆసీస్ బ్యాటర్లపై విమర్శనాస్త్రాలను సంధించాడు.
రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులతో మెరుగైన స్కోరు సాధించిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్ను భారత్ను 262 పరుగులకు కట్టడి చేయడమే కాకుండా.. రెండో ఇన్నింగ్స్ను 61/1తో శుభారంభం చేసింది. మూడో రోజు భారత స్పిన్నర్లు తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడమే కాకుండా మ్యాచ్ను చేజిక్కించుకున్నారు. రవీంద్ర జడేజా 7 వికెట్లతో అదిరిపోయే ప్రదర్శన చేసి భారత్ను 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిపారు. మూడో టెస్టు అహ్మదబాద్ వేదికగా మార్చి 1 నుంచి మొదలు కానుంది.