Roger Binny Clarifies PCB Issue: పాక్ ఆడేది లేనిది మా చేతుల్లో లేదు.. బీసీసీఐ కొత్త అధ్యక్షడు రోజర్ బిన్నీ వ్యాఖ్యలు
20 October 2022, 21:05 IST
- Roger Binny Clarifies PCB Issue: బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై చెలరేగిన వివాదంపై భారత బోర్డు నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు. తమ ఆటగాళ్లను ఎక్కడికి పంపించాలనే ఆలోచన తమ చేతుల్లో ఉండదని, ప్రభుత్వం చేతిలో ఉంటుందని స్పష్టం చేశారు.
రోజర్ బిన్నీ
Roger Binny Clarifies PCB Issue: వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఆసియా కప్ 2022 టోర్నీలో భారత్ పాల్గొనదని, తటస్థ వేదికలో నిర్వహించేలా ప్రయత్నిస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ సైతం 2023లో భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్కు దూరంగా ఉంటామని పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా స్పష్టం చేశాడు. ఫలితంగా ఈ అంశంపై ఇరుదేశాల మాజీలు, క్రీడా ప్రముఖల స్పందనలతో వివాదం చెలరేగింది. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ కూడా స్పందించారు. పాకిస్థాన్లో టీమిండియా పర్యటించే విషయం బీసీసీఐ చేతిలో ఉండదని, భారత ప్రభుత్వం చేతిలో ఉంటుందని స్పష్టం చేశారు.
"ఇది మా నిర్ణయం కాదు. మా జట్టు ఎక్కడికి వెళ్లాలనేది మేము నిర్ణయించలేం. మేము ఏదైనా దేశం లేదా ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే మా ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకోవాలి. మా అంతటా మేము నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంటుంది." అని రోజర్ బిన్నీ స్పష్టం చేశాడు.
అక్టోబరు 18న ముంబయిలో జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం బీసీసీఐ కార్యదర్శిగా ఎంపికైన ఏసీసీ అధ్యక్షుడు జైషా 2023 ఆసియా కప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ టోర్నీ తటస్థ వేదికపై జరుగుతుందని ప్రకటించారు. అనంతరం పాకిస్థాన్ అదికారులు జైషాను ఉద్దేశిస్తూ ఏసీసీ బోర్డు సభ్యుల నుంచి అధిక మద్దతు లభించిందని, పాకిస్థాన్కు ఆసియా కప్ ఆతిథ్య హక్కులు లభించాయని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది ఆసియా కప్ను తటస్థ వేదికకు మార్చాలని ఏసీసీ అధ్యక్షుడు జైషా వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆశ్చర్యాన్ని వ్యక్తంచేసింది. ఏసీసీ, పీసీబీల్లో ఎలాంటి చర్చ లేదా సంప్రదింపులు లేకుండా వాటి దీర్ఘకాలిక పరిణామాలు, చిక్కుల గురించి ఆలోచనలు లేకుండా సంచలన కామెంట్స్ చేశారని స్పష్టం చేసింది.
వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరగబోయే ఆసియాకప్ కోసం ఇండియన్ టీమ్ అక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని, ఆ టోర్నీనే తటస్థ వేదికకు మారుస్తామని బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు కూడా అయిన జై షా చెప్పడంతో వివాదం మొదలైంది. దీనిపై పాక్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. అలా అయితే తాము ఇండియాలో జరగబోయే వరల్డ్కప్తోపాటు ఇతర టోర్నీల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.