India vs Bangladesh 2nd Test: రెండో టెస్టులో అరుదైన రికార్డులపై కన్నేసిన అశ్విన్, పుజారా.. అవేంటంటే?
21 December 2022, 13:06 IST
- India vs Bangladesh 2nd Test: ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరగనున్న రెండో టెస్టులో భారత ఆటగాళ్లు అశ్విన్, పుజారాలు కొన్ని రికార్డులపై కన్నేశారు. మరో 7 వికెట్లు తీస్తే అశ్విన్ 450 వికెట్ల క్లబ్ చేరతాడు. పుజారా మరో 16 పరుగులు చేస్తే 8 వేల పరుగుల క్లబ్లో చేరతాడు.
అశ్విన్-పుజారా
India vs Bangladesh 2nd Test: బంగ్లాదేశ్-భారత్ మధ్య రెండో టెస్టు గురువారం ప్రారంభం కానుంది. ఇప్పటికే 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఇందులో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. మరోపక్క బంగ్లా కూడా కీలకమైన ఈ మ్యాచ్లో సిరీస్ సమం చేయాలని సన్నద్ధమవుతోంది. తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది మెన్ ఇన్ బ్లూ. ఇదిలా ఉంటే టీమిండియా రవిచంద్రన్ అశ్విన్, ఛేతేశ్వర్ పుజారాలు అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నారు.
ముందుగా అశ్విన్.. మరో 11 పరుగులు చేస్తే టెస్టు క్రికెట్లో 3 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఇది అంత ముఖ్యం కాదు. 3 వేల పరుగుల మైలురాయిని అధిగమిస్తే భారత స్పిన్ దిగ్గజం కపిల్ దేవ్, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వార్న్, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రిచర్డ్ హ్యాడ్లీ, సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ షాన్ పోలాక్ సరసన నిలుస్తాడు. కపిల్, వార్న్, పోలాక్, హ్యాడ్లీ, బ్రాడ్ టెస్టుల్లో 3 వేల పరుగులతో పాటు 400 వికెట్లు తీశారు. అశ్విన్ ఇప్పటికే 443 వికెట్లు తీయగా.. మరో 11 పరుగులు చేస్తే 3 వేల పరుగులు మైలురాయిని కూడా అందుకుని దిగ్గజాల జాబితాలో చేరతాడు.
అంతేకాకుండా అత్యంత వేగంగా 450 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్గా గుర్తింపు తెచ్చుకునే అవకాశం కూడా అశ్విన్ ముందు ఉంది. 87 మ్యాచ్ల్లో 443 టెస్టు వికెట్లు తీసిన ఈ తమిళనాడు ఆటగాడు.. మరో ఏడు వికెట్లు తీస్తే ఈ ఘనతను సాధిస్తాడు. మొత్తంగా చూసుకుంటే 450 వికెట్లను తీసిన రెండో వికెట్ టేకర్గా నిలుస్తాడు. అశ్విన్ కంటే ముందు శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ 2003లో 80 మ్యాచ్ల్లోనే 450 వికెట్లు తీశాడు. ఇంక భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 2005లో తన 93వ టెస్టులో ఈ రికార్డును అందుకున్నాడు. కాబట్టి కుంబ్లే రికార్డును అధిగమించే అవకాశం అశ్విన్కు ఉంది.
మరోపక్క టీమిండియా టెస్టు క్రికెటర్ ఛేతేశ్వర్ పుజారా కూడా అరుదైన రికార్డు అందుకోడానికి కాస్త దూరంలో ఉన్నాడు. మరో 16 పరుగులు చేసినట్లయితే టెస్టు క్రికెట్లో 8 వేల పరుగులు చేసిన 8వ భారత ఆటగాడిగా రికార్డు సాధిస్తాడు. పుజారా కంటే ముందు సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, విరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ఉన్నారు.
టాపిక్