Karthika Masam 2022 । కార్తీక మాసంలో శివానుగ్రహం పొందితే సంతానం కలుగుతుంది, శైవక్షేత్రాలు ఇవిగో!
03 November 2022, 15:12 IST
- Karthika Masam 2022: కార్తీక మాసం శివునికి ఎంతో ఇష్టమైన మాసం, సంతానంలేని వారు ఈ మాసంలో శివానుగ్రహం పొందితే తప్పక సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తారు. తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ శైవ క్షేత్రాలు ఏమున్నాయో, ఇక్కడ తెలుసుకోండి.
Karthika Masam 2022:
Karthika Masam 2022: హిందువులకు అతి పవిత్రమైన మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఇది మహాదేవుడైన పరమశివునికి ప్రత్యేకంగా అంకింతం ఇచ్చిన మాసం. ఈ నెలంతా భక్తులు తెల్లవారు జామునే నిద్రలేచి కార్తీక స్నానాలు ఆచరిస్తారు. శివాలయాలకు వెళ్లి శివునికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఉన్న పూజ గదిలో శివుని ముందు, అలాగే తులసి కోట ముందు దీపాలు వెలిగిస్తే శుభప్రదం అని భక్తులు విశ్వస్తారు.
లేటెస్ట్ ఫోటోలు
కార్తీక పౌర్ణమి నాడు మహా శివుడు భూమిపైకి దిగి, మొత్తం విశ్వంతో ఏకమవుతాడని నమ్ముతారు కాబట్టి శివాలయాలకు వెళ్లి భోలా శంకరుడుని శరణు కోరుతారు. కార్తీక సోమవారాల్లో ఉపవాసం కూడా ఉంటారు.
శివుడిని సంతానోత్పత్తిని ప్రసాదించే దేవుడు (God of Fertility) గా కూడా పరిగణిస్తారు. సంతానం కలగని వారు శివునికి స్వచ్ఛమైన మనసుతో పూజచేస్తే సంతానం కలుగుతుందని కూడా భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ కార్తీక మాసంలో భార్యాభర్తలు శివాలయాలను సందర్శించి సంతానం కోసం ప్రార్థిస్తే తప్పక అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మంచి ప్రాచుర్యం పొందిన శివాలయాలు ఇక్కడ చూడండి.
కీసరగుట్ట ఆలయం, హైదరాబాద్
హైదరాబాద్ నగరవాసులకు సమీపాన కీసరలో శివాలయం ఉంది. ఇది ఒక గుట్టపైన కొలువై ఉంది. ఇక్కడ 'భవానీశంకర్' గా శివుడు కొలువుదీరి ఉన్నాడు. పురాణాల ప్రకారం, ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీరాముడే స్వయంగా ప్రతిష్టించాడని ఉంది. రావణుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి రాముడు కీసరలో శివలింగ నెలకొల్పాడని చెబుతారు.
శ్రీ రాజ రాజేశ్వర దేవాలయం, వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజ రాజేశ్వర దేవాలయం 8వ - 10వ శతాబ్దాల మధ్య నిర్మించినట్లుగా చెప్పే అతి పురాతనమైన ప్రసిద్ధ శివుని దేవాలయాలలో ఒకటి. ఈ మందిరం దాని నిర్మాణ వైభవం, ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని ధర్మ గుండంలోని పవిత్ర జలాల్లో పవిత్ర స్నానం చేస్తే, పరమేశ్వరునికి శరణాగతి పొందవచ్చు.
రామప్ప దేవాలయం
వరంగల్ సమీపంలోని రామప్ప దేవాలయం కాకతీయుల కాలం నాటిది. దీని వాస్తుకళకు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేసి శివానుగ్రహం పొందవచ్చు.
మల్లికార్జున ఆలయం, శ్రీశైలం
శ్రీశైలంలోని నల్లమల కొండలపై ఉన్న మల్లికార్జున దేవాలయం ఎంతో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. దేశంలోని శివుని పన్నెండు జ్యోతిర్లింగాలు కలిగిన క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి. ఈ ఆలయం పార్వతీ దేవి పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది.
శ్రీకాళహస్తీశ్వరాలయం, శ్రీకాళహస్తి
తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని ఆలయానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. 1516లో కృష్ణదేవరాయలచే నిర్మించినట్లుగా చెప్పే ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. వివాహం, సంతానం గురించి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
టాపిక్