తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Terror Attack: ఉగ్రవాదుల దుశ్చర్య.. పౌరులపై కాల్పులు, ముగ్గురు మృతి

Terror Attack: ఉగ్రవాదుల దుశ్చర్య.. పౌరులపై కాల్పులు, ముగ్గురు మృతి

01 January 2023, 22:38 IST

    • Terror Attack in Jammu and Kashmir: ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు తెగబడ్డారు. పౌరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
పౌరులపై ఉగ్రవాదుల దాడి
పౌరులపై ఉగ్రవాదుల దాడి (PTI)

పౌరులపై ఉగ్రవాదుల దాడి

Terror Attack in Jammu and Kashmir: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదాలు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. పౌరులపై కాల్పులు జరిపి దుశ్చర్యకు దిగారు. రాజౌరి (Rajouri) జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు జరిపిన ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. బుల్లెట్ గాయాలైన గ్రామస్థులను భద్రతా దళాలు ఆసుపత్రికి తలరించాయి.

తుపాకులతో ఇద్దరు చొరబడి..

Terror Attack in Jammu and Kashmir: ఇద్దరు ఉగ్రవాదులు గన్‍లతో రాజౌరి జిల్లాలోని డంగ్రీ (Dangri) గ్రామంలోకి ఆదివారం సాయంత్రం ప్రవేశించారని అధికారులు చెప్పారు. గ్రామస్థులపై టెర్రరిస్టులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని పేర్కొన్నారు. “మూడు ఇళ్లలో ఈ కాల్పులు జరిగాయి. గాలింపు చర్యలు చేపట్టాం” అని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముకేశ్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు చనిపోగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

గాయపడిన పౌరులను రాజౌరి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స జరుగుతోంది.

పౌరులపై ఉగ్రవాదులు దాడులకు తెగపడటం ఈ జిల్లాలో 15 రోజుల్లో ఇది రెండోసారి. డిసెంబర్ 16న రౌజౌరీ ఆర్మీ క్యాంప్ సమీపంలో ఇద్దరు పౌరులను కాల్చి చంపారు టెర్రరిస్టులు.

కాగా, గతం వారం జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులను భారత దళాలు మట్టుబెట్టాయి. ఆయుధాల లారీతో భారత్‍లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముష్కరులను సైనికులు హతమార్చారు. ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారనే సమాచారం అందడటంతో భద్రతా దళాలు తనిఖీ చేసి.. ఉగ్రవాదులను కనిపెట్టాయి. ఆ తర్వాత సైనికులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. మొత్తంగా నలుగురు ఉగ్రవాదులను భారత జవాన్లు మట్టుబెట్టారు. ఇది జరిగిన ఐదో రోజుల వ్యవధిలోనే ముష్కరులు ఇప్పుడు మళ్లీ దురాగతానికి తెగబడ్డారు.