Rupee fall: 79.04కు పడిపోయిన రూపాయి.. వరుసగా రికార్డులు బ్రేక్
29 June 2022, 16:12 IST
- Rupee fall: డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మరోసారి ఆల్ టైమ్ దిగువకు పడిపోయింది. ఒక డాలరు విలువ ఇప్పుడు రూ. 79.04గా ఉంది.
రూాపాయి విలువ ఆల్ టైమ్ దిగువకు పతనమైంది. జూన్ 29న ఒక డాలరుకు 79.04 రూపాయలుగా రూపాయి విలువ పడిపోయింది. ఇదే ఆల్ టైమ్ లో.
Rupee falls: రూపాయి విలువ డాలరుతో పోలిస్తే బుధవారం మరో 19 పైసలు బలహీనపడి 79.04కు పడిపోయింది. గత కొద్ది రోజులుగా వరుసగా ఆల్ టైమ్ దిగువకు జారుకుంటూ రికార్డులు బ్రేక్ చేస్తోంది.
సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాలు చమురు ఉత్పత్తిని గరిష్ట సామర్థ్యంతో చేపడుతున్నామని ప్రకటించడంతో చమురు ధరల్లో మళ్లీ పెరుగుదల నమోదవుతోంది.
చమురు ధరల పెరుగుదలతో పాటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నిరంతరాయంగా తమ ఈక్విటీ వాటాలను తెగనమ్ముతుండడం కూడా రూపాయి సెంటిమెంటును బలహీనపరుస్తూ వస్తోంది.
ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో రూపాయి బుధవారం 78.86 వద్ద ఓపెన్ అయ్యింది. చివరకు క్రితం రోజు ముగింపుతో పోలిస్తే 19 పైసలు కోల్పోయి 79.04 వద్ద ముగిసింది. సెషన్ సమయంలో ఒక దశలో 79.05కు పడిపోయింది. కాగా శుక్రవారం 48 పైసల మేర బలహీనపడిన రూపాయి 78.85 వద్ద స్థిరపడింది.
రూపాయి విలువ ఈనెలలో 1.97 శాతం మేర పతనమైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 6.39 శాతం మేర బలహీనపడింది.
కాగా డాలర్ ఇండెక్స్ 0.13 శాతం పెరిగి 104.64 పాయింట్ల వద్ద స్థిరపడింది. ‘బలహీనమైన ప్రాంతీయ కరెన్సీలు, రిస్క్ సెంటిమెంట్ల కారణంగా రూపాయి విలువ పతనమైంది. డాలర్ హైడిమాండ్, లిక్విడిటీ.. రూపాయిపై ప్రభావం చూపాయి..’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మర్ తెలిపారు.
మరోవైపు దేశీయ మార్కెట్లు బుధవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 134.31 పాయింట్లు కోల్పోయి 53,026 పాయింట్ల వద్ద క్లోజవగా, నిఫ్టీ 32.95 పాయింట్లు కోల్పోయి 15,799.10 పాయింట్ల వద్ద ముగిసింది.
బుధవారం స్టాక్ మార్కెట్లలో టాప్ గెయినర్స్గా ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, రిలయన్స్, కోల్ ఇండియా నిలిచాయి.
టాప్ లూజర్స్ జాబితాలో హెచ్డీఎఫ్సీ లైఫ్, స్టార్ హెల్త్, హెచ్యూఎల్, అపోలో హాస్పిటల్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్జ్యూమర్స్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, యూపీఎల్, టైటాన్ కంపెనీ, కోటక్ మహీంద్రా, విప్రో, గ్రాసిం, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ తదితర స్టాక్స్ నిలిచాయి.
కాగా క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మంగళవారం రూ. 1,244 కోట్ల మేర విక్రయాలు జరిపారని స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా వెల్లడించింది.
టాపిక్