Bharat Jodo Yatra: పంజాబ్ లో అడుగుపెట్టిన భారత్ జోడో యాత్ర
10 January 2023, 22:08 IST
Bharat Jodo Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన దేశవ్యాప్త పాదయాత్ర ‘భారత్ జోడో యాత్ర’ మంగళవారం పంజాబ్ లో అడుగుపెట్టింది. పంజాబ్ లో తొలుత రాహుల్ గాంధీ పవిత్ర స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు.
అమృతసర్ లోని స్వర్ణ దేవాలయంలో రాహుల్ గాంధీ
Bharat Jodo Yatra: హరియాణా నుంచి పంజాబ్ లో తన భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. పంజాబ్ లోని అమృతసర్ లో ఉన్న సిక్కుల పవిత్ర ఆలయం స్వర్ణ దేవాలయం (Golden Temple) ను ఆయన సందర్శించారు. అక్కడ దాదాపు రెండు గంటల పాటు గడిపారు. సిక్కుల సంప్రదాయ తలపాగాలో రాహుల్ కనిపించారు.
Bharat Jodo Yatra: స్వర్ణ దేవాలయం సందర్శన
స్వర్ణ దేవాలయం(Golden Temple) నుంచి ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సర్హింద్ లో రాహుల్ మంగళవారం రాత్రి బస చేస్తారు. రాహుల్ తో పాటు పంజాబ్ కాంగ్రెస్ నేతలు అమరిందర్ సింగ్, ప్రతాప్ సింగ్ తదితరులు స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. పంజాబ్ లో భారత్ జోడో యాత్రను ప్రారంభించే ముందే, స్వర్ణ దేవాలయాన్ని (Golden Temple) సందర్శించాలనే ఉద్దేశంతో మంగళవారం ఉదయం విమానంలో రాహుల్ గాంధీ అమృత సర్ లోని శ్రీ గురురామ్ దాస్ జీ అంతర్జాతీయవిమానాశ్రయంలో దిగారు. లోహ్రి ఉత్సవాల సందర్భంగా జనవరి 12, 13 తేదీల్లో కూడా రాహుల్ పాదయాత్ర ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్ వెల్లడించారు. జనవరి 14న యాత్ర పున: ప్రారంభమవుతుందని, జనవరి 15న జలంధర్ లో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ఉంటుందని రమేశ్ తెలిపారు. రాహుల్ గాంధీ 2022 సెప్టెంబర్ 7వ తేదీని తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ దేశవ్యాప్త పాదయాత్రను ప్రారంభించారు. ఈ భారత్ జోడో యాత్ర జనవరి 30 శ్రీనగర్ లో ముగుస్తుంది. శ్రీనగర్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాహుల్ గాంధీ ఈ యాత్రను ముగిస్తారు.