Bharat Jodo Yatra: ‘140 కోట్ల జనాభా.. వంద మంది సంపన్నులు; ఇదే మోదీజీ భారత్’
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం మరోసారి హరియాణాలో ప్రవేశించారు. హరియాణాలోని పానిపట్ లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ హరియాణాలోని పానిపట్ జిల్లాలో ఉన్న సనోలి గ్రామం నుంచి శుక్రవారం భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. అనంతరం పానిపట్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు.
Bharat Jodo Yatra: మోదీజీ భారత్ లు రెండు..
ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో సంపన్నులు మరింత సంపన్నులుగా ఎదుగుతున్నారని, పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారతదేశ జనాభా 140 కోట్లు అయితే, 100 మంది సంపన్నుల చేతిలోనే 50% పైగా సంపద పోగుపడిందని, ప్రధాని మోదీజీ పాలన ఇలాఉంటుందని రాహుల్ వివరించారు. ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. ‘కార్పొరేట్ల ఆదాయాన్ని పరిశీలిస్తే, మొత్తం లాభాల్లో 90% కేవలం 20 మంది కార్పొరేట్ల జేబుల్లోకే వెళ్తున్నాయి. దేశంలోని 50% సంపద 100 మంది సంపన్నుల చేతుల్లోనే ఉంది. ఇదే మోదీ జీ కోరుకునే భారత్ ఇదే ’ అని రాహుల్ విమర్శించారు.
Bharat Jodo Yatra: రెండు ఇండియాలు..
ప్రస్తుతం రెండు ఇండియాలు ఉన్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. ఒకటి 100 కోట్లకు పైగా ఉన్న పేదలు, సామాన్యుల ఇండియా కాగా, మరొకటి 200 నుంచి 300 మంది ఉండే సంపన్నుల భారత్ అని రాహుల్ వివరించారు. పానిపట్ తనకు ఘన స్వాగతం ఇచ్చిందని రాహుల్ అన్నారు. అయితే, ఇక్కడి ప్రజలకు విషవాయువులను మినహా ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదని విమర్శించారు. ఒకప్పుడు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు పానిపట్ కేంద్రంగా ఉండే విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ, నోట్ల రద్దు కారణంగా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నాశనమయ్యాయని ఆరోపించారు. 38% నిరుద్యోగితతో హరియాణా ఇప్పడు దేశంలోనే టాప్ లో ఉందన్నారు.
Bharat Jodo Yatra: అగ్నివీర్ తో నిరుద్యోగం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అగ్నివీర్ పథకంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. సాయుధ దళాల్లోకి ఏటా 80 వేల మందిని రిక్రూట్ చేసుకుని, నాలుగేళ్ల సర్వీసు తరువాత వారిలో 25% మందిని మాత్రమే రెగ్యలరైజ్ చేస్తామంటున్నారని, అంటే నాలుగేళ్ల తరువాత మిగతా 75% మంది మళ్లీ నిరుద్యోగులుగా మిగలాల్సిందేనని వివరించారు. ఈ విషయంపై మాట్లాడితే, తనను సైనిక దళాలకు వ్యతిరేకినని విమర్శిస్తున్నారని రాహుల్ గాంధీ వివరించారు.