Mamata comments on Opposition unity : ‘2024 ఎన్నికల్లో వీరితో కలిసి పనిచేస్తాం’
08 September 2022, 16:44 IST
2024 లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల ఐక్యతపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కీలక ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కలిసి పనిచేసే విపక్ష పార్టీల వివరాలను వెల్లడించారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ
Mamata comments on Opposition unity : రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై ఐక్య పోరుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో విపక్షాల మధ్య ఐక్యత లేదని, ప్రధాని పదవి కోసం అవి కొట్టుకుంటాయని బీజేపీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో కలిసి పనిచేసే పార్టీలపై టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Mamata comments on Opposition unity : వీరితో కలిసి పని చేస్తాం..
లోక్ సభ ఎన్నికల్లో తను, బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్, జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సొరేన్ తదితర నేతలు కలిసి పనిచేస్తారని ఆమె వెల్లడించారు. తమతో పాటు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ తదితరలు కలిసి వస్తారని ఆమె తెలిపారు. 2024 ఎన్నికల్లో బీజేపీని అధికారంలో నుంచి దింపడమే లక్ష్యంగా తామంతా కలిసి పనిచేస్తామన్నారు.
Mamata comments on Opposition unity : దక్షిణాది నేతల ప్రస్తావన ఏది?
అయితే, మమత వ్యాఖ్యల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నాయకుల ప్రస్తావన లేకపోవడం గమనార్హం. బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో పోరాడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన బిహార్ వెళ్లి ఆ రాష్ట్ర సీఎం నితీశ్ తో, ఆర్జేడీ నేతలు లాలు ప్రసాద్ యాదవ్, తేజస్వీ లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మరోవైపు, తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ స్టాలిన్ కూడా దేశంలోని కీలక విపక్ష నేతల్లో ఒకరు. ఆయనను కలుపుకుపోయే విషయంపై కూడా మమత ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అలాగే, దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో కలిసి పని చేసే విషయం కూడా ఆమె ప్రస్తావించకపోవడం గమనార్హం.
Mamata comments on Opposition unity : బీజేపీ ఓటమి తప్పదు
కోల్ కతాలో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, 300 సీట్లు గెలుచుకున్నామన్న గర్వమే ఆ పార్టీకి శాపంగా మారుతుందని ఆమె హెచ్చరించారు. నాయకులను అరెస్ట్ చేస్తే, కార్యకర్తలు భయపడ్తారని బీజేపీ భావిస్తోందని, కానీ, టీఎంసీ కార్యకర్తలు అలా భయపడే వారు కాదని వ్యాఖ్యానించారు. ఒక కుంభకోణంలో అరెస్టైన పార్టీ నేత అనుబ్రత మొండల్ ధీరుడిగా బయటకు వస్తారన్నారు. సీబీఐ, ఈడీ ల సహకారంతో ఎన్నికల్లో గెలవొచ్చని బీజేపీ పగటి కలలు కంటోందని మమత ఎద్దేవా చేశారు.
Mamata comments on Opposition unity : జార్ఖండ్ ను కాపాడాం
జార్ఖండ్ లో కూడా మహారాష్ట్ర తరహాలో కుట్రకు బీజేపీ ప్రయత్నించిందని, ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర చేస్తోందని ఆమె విమర్శించారు. కోల్ కతాలో డబ్బుతో ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం ద్వారా వారి కుట్రను విఫలం చేశామని ఆమె వెల్లడించారు. భారీ నగదుతో ఉన్నముగ్గురు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జులై 30న పశ్చిమబెంగాల్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.