crime news: ‘దృశ్యం’ సినిమా సీన్ రిపీట్..
01 October 2022, 20:41 IST
crime news: వెంకటేశ్ హీరోగా వచ్చిన దృశ్యం సినిమా గుర్తుంది కదా? అందులో మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ ఫ్లోర్ లో కప్పెట్టేస్తాడు కదా. అలాంటి సీనే కేరళలో రిపీట్ అయింది.
ప్రతీకాత్మక చిత్రం
crime news: కేరళలోని కొట్టాయంలో బిందు కుమార్ బీజేపీ క్రియాశీల కార్యకర్త. సెప్టెంబర్ 26 నుంచి ఆయన కనిపించకుండా పోయాడు. సెప్టెంబర్ 28న ఆయన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
crime news: మిత్రుడే హంతకుడు..
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట బిందుకుమార్ మొబైల్ ఫోన్ ను చంగనసరయి దగ్గర్లోని ఒక టెలీకాం టవర్ పరిధిలో గుర్తించారు. అక్కడికి దగ్గర్లోనే అతడి బైక్ ను కూడా గుర్తించారు. ఆ ప్రాంతానికి దగ్గరలోనే బిందుకుమార్ తో పాటు నిత్యం కలిసి ఉండే ముత్తు కుమార్ ఇల్లు ఉంటుందని కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. దాంతో పోలీసులు ముత్తుకుమార్ ఇంటికి వెళ్లి, ఆయనను విచారించారు.
crime news: కొత్త కాంక్రీట్ నిర్మాణం
ఆ సమయంలో ముత్తు కుమార్ ఇంట్లో కొత్తగా కాంక్రీట్ చేసినట్లుగా ఉన్న ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. దాని విషయమై ప్రశ్నించగా, ముత్తుకుమార్ తడబడుతూ సమాధానమివ్వడాన్ని గుర్తించిన పోలీసులు, ఆ ప్రాంతాన్ని తవ్వడం ప్రారంభించారు. దాదాపు ఆరు గంటల పాటు తవ్విన తరువాత అక్కడ కప్పెట్టేసిన బిందు కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. ముత్తుకుమార్ ను అరెస్ట్ చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.