Jammu and Kashmir: కశ్మీర్లో ముగ్గురు జవాన్ల దుర్మరణం
19 November 2022, 14:34 IST
Jammu and Kashmir: కశ్మీర్లో ముగ్గురు భారత జవాన్లు దుర్మరణం పాలయ్యారు. జమ్మూకశ్మీర్లోని మాచిల్ సెక్టార్లో హిమపాతం కారణంగా ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
కశ్మీర్లో హిమపాతం దృశ్యం
జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్లో ఈ ప్రమాదం జరిగింది. భారతీయ సైన్యానికి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందిన ముగ్గురు సైనికులు మంచు చరియలు విరిగిపడడంతో, వాటి కింద చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
3 jawans died in Kashmir: విధుల్లో భాగంగా..
మాచిల్ సెక్టార్లో విధుల్లో ఉండగా, ఆ సైనికులపై మంచు చరియలు విరిగిపడ్డాయని, దాంతో, వారు వాటికింద చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారని జమ్మూకశ్మీర్ పోలీసులు వెల్లడించారు. వారు విధుల నుంచి తిరిగి రాకపోవడంతో, గాలింపు చేపట్టామని, శనివారం వారి మృతదేహాలు లభ్యమయ్యాయని వివరించారు. ‘56ఆర్ఆర్ కు చెందిన ముగ్గురు జవాన్లు విధుల్లో భాగంగా మచ్చిల్ సెక్టార్లో ఉండగా హిమపాతం కారణంగా అమరులయ్యారు’ అని కుప్వారా పోలీసులు ప్రకటించారు. శీతాకాలంలో కశ్మీర్లో హిమపాతం సాధారణం. అలాగే, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(Border Roads Organisation BRO) దళాలు ఎప్పటికప్పుడు దీనిని క్లియర్ చేస్తుంటాయి.
Jammu Kashmir LG instructions: ఎల్జీ ఆదేశాలు
ఈ కాలంలో చలితో ప్రజలు, సైనికులు ఇబ్బంది పడకుండా 24 గంటల పాటు విద్యుత్, నీరు, ఔషధాలు, రేషన్, ఇతర నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులను ఆదేశించారు.