AIIMS new Director: ఎయిమ్స్ ఢిల్లీ నూతన డైరెక్టర్గా డాక్టర్ శ్రీనివాస్
23 September 2022, 16:23 IST
- AIIMS new Director: ఎయిమ్స్ ఢిల్లీ నూతన డైరెక్టర్గా డాక్టర్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ డీన్గా ఉన్నారు.
ఎయిమ్స్ ఢిల్లీ
AIIMS new Director: న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తదుపరి డైరెక్టర్గా డాక్టర్ ఎం.శ్రీనివాస్ శుక్రవారం నియమితులయ్యారు. దేశ ప్రముఖ హెల్త్ ఇన్స్టిట్యూట్ అధిపతిగా ఉన్న డాక్టర్ రణదీప్ గులేరియా పదవీకాలం నేటితో ముగియనుండడంతో ఆయన స్థానంలో డాక్టర్ శ్రీనివాస్ నియమితులయ్యారు.
ఎయిమ్స్ డైరెక్టర్ పదవికి డాక్టర్ గులేరియా రెండుసార్లు మూడు నెలల పొడిగింపును అందుకున్నారు. అతను మార్చి 28, 2017న ఈ బాధ్యతలు స్వీకరించారు.
కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ద్వారా నియామకపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎయిమ్స్ డైరెక్టర్గా డాక్టర్ శ్రీనివాస్ నియామకానికి కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ జూన్ 20న ఎయిమ్స్ డైరెక్టర్ పదవికి అభ్యర్థిని పరిశీలించేందుకు పలు పేర్లను కోరింది.
‘నియామకం పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి ఐదేళ్ల కాలానికి లేదా 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఏది ముందుగా ఉంటే అది వర్తిస్తుంది..’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
డాక్టర్ శ్రీనివాస్ 2016లో హైదరాబాద్లోని ఈఎస్ఐసీ హాస్పిటల్, మెడికల్ కాలేజీలో చేరడానికి ముందు ఎయిమ్స్-ఢిల్లీలోని పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఈఎస్ఐసీ ఆసుపత్రిలో డీన్గా ఉన్నారు.
త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ బెహారీ కూడా ఈ పోస్ట్ కోసం పరిశీలనకు వచ్చింది. అయితే డాక్టర్ శ్రీనివాస్ లేదా డాక్టర్ బెహారీ ఈ పదవికి దరఖాస్తు చేయలేదని పీటీఐ వార్తా సంస్థ కథనం తెలిపింది.
టాపిక్