తెలుగు న్యూస్  /  National International  /  Cyclone Mandous Nears Tamil Nadu Heavy Rains In 13 District Schools Remain Shut

Cyclone Mandous: భయపెడుతున్న మాండస్ తుఫాను.. పాఠశాలలు బంద్.. ప్రజలకు జాగ్రత్తలను సూచించిన ప్రభుత్వం

09 December 2022, 11:31 IST

    • Cyclone Mandous: మాండస్ తుఫాను తమిళనాడు తీరాన్ని సమీపిస్తోంది. ఈ ప్రభావంతో తమిళనాడులోని 13 జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలపైనా ప్రభావాన్ని చూపిస్తోంది.
Cyclone Mandous: భయపెడుతున్న మాండస్ తుఫాను.. పాఠశాలలు బంద్
Cyclone Mandous: భయపెడుతున్న మాండస్ తుఫాను.. పాఠశాలలు బంద్ (AFP)

Cyclone Mandous: భయపెడుతున్న మాండస్ తుఫాను.. పాఠశాలలు బంద్

Cyclone Mandous: మాండస్ తుఫాను తమిళనాడును హడలెత్తిస్తోంది. ఇప్పటికే ఈ తుఫాను ప్రభావంతో చెన్నైతో పాటు 12 జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో చెన్నైలో ఇప్పటికే 52.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇంకా కురుస్తోంది. నేటి అర్ధరాత్రి చెన్నై సమీపంలోని మహాబలిపురం వద్ద ఈ మాండస్ తుఫాను తీరం దాటనుంది. తుఫాను నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపైనా ప్రభావం ఉంది. పూర్తి వివరాలు ఇవే.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఈ మాండూస్ తుఫాను ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో సుమారు 12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. మహాబలిపురంలో తీరందాటే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

విద్యాసంస్థలకు సెలవు

Cyclone Mandous: మాండస్ తుఫాను ప్రభావం కారణంగా చెన్నై, తిరువల్లూరు, చెంగల్పట్టు, వేలూరు, రాణిపెటై, కాంచీపురంతో పాటు మొత్తంగా 12 జిల్లాల్లోని పాఠశాలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. సహాయక చర్యల కోసం 13 జిల్లాల్లో ఎన్‍డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. అన్ని పార్కులు, ప్లే గ్రౌండ్‍లను మూసేయాలని పురపాలక సంఘాలను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,093 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తమిళనాడు అధికారులు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‍పైనా మాండస్ తుఫాను ప్రభావం అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురంతో పాటు తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులతో ఆ రాష్ట్ర సీఎం జగన్‍మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి కూడా తుఫాను సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

Cyclone Mandous: తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వం చెప్పింది. ఎవరూ బీచ్‍లకు వెళ్లవద్దని సూచించింది. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదని చెప్పింది. తుఫాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో టార్చ్ లు, బ్యాటరీలు, కొవ్వొత్తులు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పింది. తాగునీరు, డ్రైఫ్రూట్స్ వెంట ఉంచుకోవాలని సూచించింది. చెట్ల కింద కార్లను పార్క్ చేయవద్దని ప్రజలకు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అలాగే మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదని చెప్పింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న బోట్లను వెనక్కి రప్పించేందుకు కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.