Cabinet revises OROP: విశ్రాంత సైనికులకు శుభవార్త; OROPపై కేంద్రం కీలక నిర్ణయం
23 December 2022, 22:19 IST
Cabinet revises OROP: ఒక ర్యాంక్ తో రిటైర్ అయిన ఆర్మీ ఉద్యోగులందరికీ ఒకే పెన్షన్(One Rank One Pension scheme) ఉండడానికి సంబంధించి రిటైర్డ్ సైనికుల డిమాండ్ ను కేంద్రం ఆమోదించింది. ఓఆర్ ఓపీ(OROP) రివిజన్ కు ఆమోదం తెలిపింది.
కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న కేంద్రమంత్రి ఠాకూర్
Cabinet revises OROP: వన్ ర్యాంక్.. వన్ పెన్షన్(OROP) పథకాన్ని రివైజ్ చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సుమారు 25 లక్షల మంది విశ్రాంత సైనికులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర కేబినెట్ ఈ విషయమై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.
Cabinet revises OROP: 2019 నుంచి ఏరియర్స్
ఈ ఓఆర్ఓపీ(OROP) బకాయిలను 2019 జులై 1 వ తేదీ నుంచి 2022 జూన్ 30 వరకు లెక్కించి, చెల్లిస్తారు. ఇందుకు గానూ కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ. 8450 కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయంతో 25.13 లక్షల మంది రిటైర్డ్ సైనికోద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 2019, జూన్ 30 న లేదా అంతకన్నా ముందు పదవీ విరమణ చేసిన సుమారు 25 లక్షలమంది సాయుధ దళాల ఉద్యోగులు ఈ OROP పథకం పరిధిలోకి వస్తారు. అర్హులైన విశ్రాంత సైనికులు, లేదా వారి కుటుంబ సభ్యులకు ఈ బకాయిలను ప్రతీ ఆరు నెలలకు ఒకసారి చొప్పున రెండేళ్ల పాటు చెల్లిస్తామని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. గాలంట్రీ అవార్డు విన్నర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు, లిబరలైజ్డ్ ఫ్యామిలీ పెన్షనర్లకు ఒకే విడతలో ఏరియర్లను చెల్లిస్తామన్నారు.
Cabinet revises OROP: పీఎంకు రాజ్ నాథ్ థ్యాంక్స్
‘విశ్రాంత సైనికోద్యోగుల చిరకాల డిమాండ్ OROP పై సానుకూలంగా స్పందించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు’ అంటూ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. విశ్రాంత సైనికోద్యోగుల ఈ OROP డిమాండ్ పై గత ప్రభుత్వాలేవీ సానుకూలంగా స్పందించలేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ విషయమై వారికి హామీ ఇచ్చామని అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు.