Cabinet decisions: ఎరువుల సబ్సీడీ రేట్లపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
17 May 2023, 19:09 IST
రైతులకు నాణ్యమైన ఎరువులను సబ్సీడీ ధరలకే అందజేసే లక్ష్యంలో భాగంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పొటాషియం, పాస్ఫరస్ ఎరువుల సబ్సీడీ రేట్లలో మార్పులు చేయడానికి ఆమోదం తెలిపింది.
ప్రతీకాత్మక చిత్రం
ఎరువులకు వాటి పోషకాధార సబ్సీడీ (nutrient-based subsidy NBS) ధరలను సవరించడానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కొత్త సబ్సీడీ రేట్లు పాస్ఫరస్, పొటాషియం (phosphatic and potassic P&K) ఎరువులకు రబీ సీజన్ తో పాటు ఖరీఫ్ సీజన్ కు వర్తిస్తాయి. రైతులకు నాణ్యమైన ఎరువులను సబ్సీడీ ధరలకే అందజేసే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
రూ. 38వేల కోట్లు..
ఈ సబ్సీడీకి గానూ కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు రూ. 38 వేల కోట్లను వెచ్చిస్తోంది. రైతులకు తక్కువ ధరకు పోషక విలువలతో కూడిన ఎరువులను అందించే లక్ష్యంతో ఈ సబ్సీడీ పథకాన్ని 2010లో ప్రారంభించారు. తాజాగా, ఆ ఎరువుల సబ్సీడీ రేట్లను సవరించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు.
కేంద్రం నిర్ణయం వల్ల రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ లో అందుబాటు ధరలో, సరైన సమయానికి నాణ్యమైన డీఏపీ (DAP), ఇతర పాస్ఫరస్, పొటాషియం (P&K) ఎరువులు లభిస్తాయి. ప్రస్తుతం యూరియా బ్యాగ్ ధర రూ. 276 గా, డీఏపీ ధర రూ. 1350 గా ఉంది.