3 Kota students dead: ముగ్గురు ‘కోటా’ కోచింగ్ సెంటర్ విద్యార్థుల ఆత్మహత్య!
13 December 2022, 21:16 IST
Suicides in Kota: కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి గాంచిన రాజస్తాన్ లోని కోటాలో ముగ్గురు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
Suicides in Kota: IIT JEE, NEET తదితర ప్రవేశ పరీక్షలకు శిక్షణ పొందడానికి దేశం నలువైపుల నుంచి విద్యార్థులు రాజస్తాన్ లోని కోటా(Kota) కు వస్తారు. అక్కడి ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంటూ, ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతూ ఉంటారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులు చాలా మంది ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు చాలా జరిగాయి.
Students Suicides in Kota: ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
తాజాగా, కోటాలో వివిధ ప్రవేశ పరీక్షలకు శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు వేర్వేరు ప్రదేశాల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారు నివసిస్తున్న ప్రైవేట్ అకామడేషన్ లలో విగత జీవులుగా కనిపించారు. వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కోటా(Kota) ఎస్పీ కేశర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోటా(Kota)లోని ఒక ప్రైవేటు అకామడేషన్ లో పక్క పక్క గదుల్లో ఉంటున్న ఇద్దరు విద్యార్థులు సోమవారం తమ గదుల్లో చనిపోయి కనిపించారు. ఈ విషయాన్ని ఇంటి ఓనరు పోలీసులకు తెలిపారు. వారు బిహార్ కు చెందిన విద్యార్థులు. వారి వద్ద ఎలాంటి సూయిసైడ్ లెటర్ లభించలేదు. వారు స్నేహితులా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. 11వ తరగతి చదువుతున్న వారిద్దరు Kota లో ఒకే కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్నారని, వారిలో ఒకరి వయస్సు 19 ఏళ్లు కాగా,మరొకరి వయస్సు 18 ఏళ్లు. వారి మరణ వార్త కుటుంబ సభ్యులకు తెలియచేశామని, మరిన్ని వివరాల కోసం వారి మొబైల్ ఫోన్ లను చెక్ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. వారిద్దరు గత మూడేళ్లుగా కోటా(Kota)లో ఉంటున్నారని, గత ఆరు నెలలుగా ఈ అద్దె ఇంటిలో ఉంటున్నారని వివరించారు.
Students Suicides in Kota: మరో ఘటనలో..
మరో ఘటనలో 17 ఏళ్ల మరో విద్యార్థి కూడా అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతడు కూడా తను అద్దెకు ఉంటున్న నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. 17 ఏళ్ల మధ్యప్రదేశ్ కు చెందిన ఈ విద్యార్థి నీట్ పరీక్ష కోసం గత రెండేళ్లుగా కోటాలో కోచింగ్ తీసుకుంటున్నాడు. విషం తీసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విద్యార్థి వద్ద కూడా సూయిసైడ్ లేఖ లభించలేదు. గత నెలలో ఉత్తరాఖండ్ విద్యార్థి, జూన్ నెలలో అండమాన్ నుంచి వచ్చిన విద్యార్థి ఇలాగే ఆత్మహత్యకు పాల్పడి చనిపోయారు. ఈ నేపథ్యంలో, కోచింగ్ సెంటర్లను నియంత్రించే దిశగా రాజస్తాన్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోంది.