ICC Rankings: దక్షిణాఫ్రికాపై గెలిచినా.. నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా.. టాప్కు ఏ జట్టు చేరిందంటే..
05 January 2024, 16:36 IST
- ICC Test Rankings: ఐసీసీ ర్యాంకింగ్ల్లో ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని టీమిండియా కోల్పోయింది. దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో గెలిచినా.. టాప్ ప్లేస్ను నిలబెట్టుకోలేకపోయింది. ఆ వివరాలివే..
ICC Test Rankings: దక్షిణాఫ్రికాపై గెలిచినా.. నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన టీమిండియా
ICC Test Rankings: దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. కేప్టౌన్లోని న్యూలాండ్స్ మైదానంలో కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా గడ్డపై రెండు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. సఫారీ టూర్ను గ్రాండ్గా ముగిచింది. అయితే, దక్షిణాఫ్రికాపై గెలిచినా.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ల్లో ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని భారత్ కోల్పోయింది. రెండో స్థానానికి పడిపోయింది.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ల్లో ఇండియాను వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరింది. తాజా ర్యాంకింగ్లను ఐసీసీ నేడు (జనవరి 5) వెల్లడించింది. పాకిస్థాన్తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఆస్ట్రేలియా. ప్రస్తుతం మూడో టెస్టు జరుగుతోంది. అయితే, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ను భారత్ సమం చేసుకోగా.. పాక్పై ఆసీస్ 2-0తో ముందంజ వేసింది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్ల్లో ఆసీస్ లాభపడింది. టాప్ ర్యాంకుకు చేరింది.
118 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ల్లో ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరింది. 117 పాయింట్లు ఉన్న భారత్ రెండో స్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్ (115 పాయింట్లు) మూడో ప్లేస్లో ఉండగా.. దక్షిణాఫ్రికా (106), న్యూజిలాండ్ (95) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత పాకిస్థాన్ (92), శ్రీలంక (79), వెస్టిండీస్ (77), బంగ్లాదేశ్ (51), జింబాబ్వే (32), అఫ్గానిస్థాన్ (10) వరుసగా ఉన్నాయి.
“స్వదేశంలో పాకిస్థాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో అద్భుతంగా ఆడుతుండడంతో ఆస్ట్రేలియా మళ్లీ నంబర్ 1 టెస్టు జట్టుగా అవతరించింది. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ను 1-1తో భారత్ సమం చేసుకుంది. పాకిస్థాన్తో జరుగుతున్న సిరీస్లో ఆస్ట్రేలియా ఇప్పటికే రెండు గెలిచింది. దీంతో ప్యాట్ కమిన్స్ సాారథ్యం వహిస్తున్న ఆ జట్టు ఇప్పుడు టాప్ ప్లేస్కు చేరింది” అని ఐసీసీ వెల్లడించింది.
మరోవైపు, వరల్డ్ టెస్టు చాంపియన్ 2023-25 సైకిల్లో భారత్ ప్రస్తుతం 54.16 గెలుపు శాతంతో టాప్లో ఉంది. ఈ సైకిల్లో ఇప్పటి వరకు 4 టెస్టులు ఆడిన భారత్ రెండు గెలువగా.. ఒక ఓటమి, ఒక డ్రా ఉన్నాయి.
అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల (జనవరి 11 నుంచి) సిరీస్ తర్వాత టీమిండియా తదుపరి ఇంగ్లండ్తో సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. జనవరి 25న భారత్, ఇంగ్లిష్ జట్టు టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్లో పూర్తి ఆధిపత్యంతో గెలిస్తే భారత్.. మళ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ల్లో టాప్కు చేరే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అలాగే, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాను ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. అలాగే, వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ భారత్ను ఓడించి ట్రోఫీ దక్కించుకుంది ఆసీస్. రెండుసార్లు టీమిండియాను దెబ్బ తీసింది. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్ల్లోనూ భారత్ను రెండో స్థానానికి నెట్టి టాప్ ప్లేస్కు చేరింది.
ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్ల్లో వన్డేలు, టీ20ల్లో టీమిండియా నంబర్ వన్ స్థానంలో ఉంది.
టాపిక్