CM Jagan Madanapalli Tour: నేడు మదనపల్లికి సీఎం జగన్ - విద్యాదీవెన నిధుల విడుదల
30 November 2022, 7:04 IST
- CM Jagan Latest news: ఏపీ సీఎం జగన్ ఇవాళ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన పథకం నిధులను విడుదల చేస్తారు.
సీఎం జగన్
CM Jagan Annamayya district Tour: సీఎం జగన్ ఇవాళ అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. మదనపల్లెలో జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు నిధులను విడుదల చేయనున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేస్తారు. ఈ దఫాలో మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.
జులై-సెప్టెంబర్ 2022 త్రైమాసికానికి 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లను బటన్ నొక్కి నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. 2017 సంవత్సరం నుండి పెట్టిన బకాయిలు.., రూ. 1,778 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 12,401 కోట్లుగా ఉంది.
పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందిని చదివించవచ్చు. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.
జగనన్న వసతి దీవెన కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ప్రభుత్వం సాయం చేస్తోంది. భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తోంది.
నాల్గో విడత విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా మదనపల్లె సీఎం పర్యటన ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఈనెల 23వ తేదీ జరగాల్సిన ఈ కార్యక్రమం మొదట సమయం తక్కువగా ఉందని ఏర్పాట్లు చేయలేమన్న అధికారుల సూచనలతో 25కు మార్పు చేశారు. అయితే 25న తుఫాను ప్రభావంతో సీఎం పర్యటన వాయిదా పడింది. ఎట్టకేలకు ఇవాళ మదనపల్లెకు సీఎం జగన్ రానున్నారు. మరోవైపు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.