Indrakeeladri Navaratri 2022 : దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
02 October 2022, 17:02 IST
- Vijayawada Kanaka Durga : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు.
సీఎం జగన్
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు సీఎం జగన్(CM Jagan) పట్టువస్త్రాలు సమర్పించారు. అత్యంత ప్రాశస్త్యమైన మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం(State Government) తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు.
ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ బయలు దేరి ఇంద్రకీలాద్రి(Indrakeeladri) చేరుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆలయం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆలయ స్థానాచార్యులు విష్ణు బట్ల శివప్రసాద్ శర్మ పరివేష్టితం నిర్వహించారు. పరివేష్టితం ధారణతో అమ్మ వారికి సమర్పించే పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను ముఖ్యమంత్రి తలపై పెట్టుకుని ఆలయంలోకి అడుగు పెట్టారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రాలతో అంతరాలయంలోకి ప్రవేశించారు. శ్రీసరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మ వారి పేరున సమర్పించారు.
అంతరాలయంలో ప్రధాన అర్చకులు లింగం బట్ల దుర్గాప్రసాద్, ఇతర అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో వేద పండితులు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వచనం పలికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.