CM Jagan In Assembly : దేశంలో అతిపెద్ద స్కాం ఇది.. చంద్రబాబుకు ఉన్న స్కిల్ అది-ap assembly session cm jagan speech on skill development scam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Assembly Session Cm Jagan Speech On Skill Development Scam

CM Jagan In Assembly : దేశంలో అతిపెద్ద స్కాం ఇది.. చంద్రబాబుకు ఉన్న స్కిల్ అది

HT Telugu Desk HT Telugu
Mar 20, 2023 05:14 PM IST

CM Jagan On Skill Development Scam : స్కిల్ పేరిట గత ప్రభుత్వం అడ్డంగా దోచుకుందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలోనే కాదు.. దేశ చరిత్రలో అతి పెద్ద స్కామ్ అన్నారు. డబ్బులు దోచుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్(ఫైల్ ఫొటో)
అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్(ఫైల్ ఫొటో) (twitter)

ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ మీద చర్చ జరిగింది. ఇందులో భాగంగా సీఎం జగన్(CM Jagan) మాట్లాడారు. దేశ చరిత్రలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం(Skill Development Scam) అతి పెద్దదని చెప్పారు. విద్యార్థుల పేరుతో జరిగిన అతి పెద్ద స్కామ్ అని తెలిపారు. స్కిల్ పేరుతో గత ప్రభుత్వం అడ్డంగా దోచుకుందని జగన్ అన్నారు. డబ్బులు కొట్టేయడంలో చంద్రబాబు చూపించిన అతిపెద్ద స్కిల్ ఇది అని విమర్శించారు.

ట్రెండింగ్ వార్తలు

రూ.371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారని సీఎం జగన్(CM Jagan) అన్నారు. ఈ మనీని షెల్ కంపెనీ ద్వారా మళ్లించారని ఆరోపించారు. విదేశీ లాటరీ తరహాలో స్కామ్ కు పాల్పడ్డారన్నారు. పక్కా స్కిల్ ఉన్న క్రిమినల్ కేసు ఇది అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ స్కామ్ ఏపీలో మెుదలై విదేశాలకు పాకిందని సీఎం జగన్ అన్నారు.

'విదేశాల నుంచి షెల్ కంపెనీల ద్వారా తిరిగి సొమ్ము రాష్ట్రానికి వచ్చింది. ముఠాగా ఏర్పడి రూ.371 కోట్లు కొట్టేశారు. చంద్రబాబు ముఠా విజన్ ప్రకారం.. స్కామ్ చేశారు. దోచేసిన డబ్బులను ఎలా జేబులో వేసుకోవాలో బాబుకు బాగా తెలుసు. ఇన్వెస్టిగేషన్ చేస్తే.. ఏం చేయాలో బాబు పక్కాగా ప్లాన్ చేశారు. ఇలా ఒక క్రిమినల్ మాత్రమే చేయగలడు. ప్రాజెక్టు చేపడితే.. పూర్తి చర్చ జరగాలి. కానీ చంద్రబాబు టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదు.' అని సీఎం జగన్ అన్నారు.

సీమెన్స్ అనే ప్రవేటు సంస్థ రూ.3వేల కోట్లు ఇస్తుందని ప్రచారం చేశారని సీఎం జగన్ అన్నారు. ప్రైవేటు కంపెనీ ఎక్కడైనా.. రూ.3వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా అని జగన్ ప్రశ్నించారు. డీపీఆర్(DPR)ను సైతం తయారు చేయించలేదని చెప్పారు. చంద్రబాబు(Chandrababu) అన్ని నిబంధనలను బేఖాతరు చేశారన్నారు. 6 కస్టర్లు ఏర్పాటు చేస్తామని జీవోలో చెప్పారని సీఎం అన్నారు. ఒక క్లస్టర్ కు రూ.546 కోట్లు ఖర్చు చేస్తామన్నారన్నారు. మిగిలిన రూ.3వేల కోట్లు సీమెన్స్ ఇస్తుందని జీవోలో తెలిపినట్టుగా వెల్లడించారు.

'తొంభై శాతం సీమెన్స్, పది శాతం ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. సుమారు మూడు వేల కోట్లు సీమెన్స్ ఇస్తుందని ప్రచారం చేశారు. కేబినెట్(Cabinet) నిర్ణయం, ఒప్పందానికి సంబంధం లేకుండా జీవో స్వరూపాన్ని మార్చేశారు. జీవో వేరే, ఒప్పంద వేరు.. ఎలా సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టు మెుత్తం ఖర్చు రూ.3,356 కోట్లు. ప్రభుత్వం వాటా పది శాతం. ఇందులో 90 శాతం.. సీమెన్స్, డిజైన్ టెక్ భరిస్తుందన్నారు. పది శాతం అంటే రూ.371 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. మూడు నెలల కాలంలోననే ఐదు దఫాలుగా రూ.371 కోట్లు విడుదల చేశారు. చంద్రబాబు పాత్ర లేకుండానే.. ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా?' అని జగన్ అడిగారు.

తాను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తే.. చంద్రబాబు బటన్ నొక్కితే తిరిగి ఆయన ఖాతాలోకే సొమ్ము జమ అయ్యిందని సీఎం జగన్ విమర్శించారు. డబ్బును గ్రాంట్ గా ఇస్తే.. మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఒప్పందంలో ఎక్కడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే ప్రస్తావనే లేదని చెప్పారు. ఈ స్కామ్ లో ప్రధాన ముద్దాయి చంద్రబాబు అని జగన్ ఆరోపించారు. సీమెన్స్ సంస్థ కూడా ఇంటర్నెల్ దర్యాప్తు జరిపి.. ప్రభుత్వ జీవోతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిందని సీఎం తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం