YS Sharmila Padayatra: షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్.. పోలీసుల షరతులు ఇవే.!
28 January 2023, 7:08 IST
- YSRTP Chief YS Sharmila Padayatra:వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతిచ్చారు. అయితే పలు కండీషన్లు విధించారు. ఫిబ్రవరి 2 నుంచి 18 వరకూ పాదయాత్ర నిర్వహించుకోవడానికి వరంగల్ సీపీ రంగనాథ్ అనుమంతించారు.
వైఎస్ షర్మిల
ys sharmila praja prasthanam padayatra: వరంగల్ జిల్లా పరిధిలో గతేడాది వైఎస్ షర్మిల పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే. నర్సంపేట ఘటన నేపథ్యంలో ఆమె పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవటంతో యాత్ర ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ అక్కడ్నుంచే పాదయాత్ర చేస్తారని అంతా భావించినప్పటికీ... అలా జరగలేదు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో వైఎస్ షర్మిల పాదయాత్ర ఆగిపోవాల్సి వచ్చింది. అయితే తాజాగా వరంగల్ పోలీసులు షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆమె ప్రజాప్రస్థానం యాత్ర మళ్లీ పునఃప్రారంభం కానుంది.
షర్మిల పాదయాత్ర కు పోలీసులు కండీషన్లతో కూడిన అనుమతినిచ్చారు. చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద గత ఎడాది నవంబర్ 28న షర్మిల అరెస్ట్తో పాదయాత్ర నిలిచిన విషయం తెలిసిందే. ఈనెల 25న తిరిగి పాదయాత్ర నిర్వహించుకోవాడనికి సీపీకి వైఎస్ఆర్టీపీ నేతలు దరాఖాస్తు చేశారు. అయితే వచ్చే నెల 2 నుంచి 18 వరకూ పాదయాత్ర నిర్వహించుకోవడానికి వరంగల్ నగర సీపీ రంగనాథ్ అనుమతించారు. ఉదయం నుంచి 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతినిచ్చారు. పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా ఉద్దేశించి వివాస్పదవాఖ్యలు చేయవద్దని కండీషన్లు పెట్టారు. ర్యాలీల్లో ఫైర్ క్రాకర్స్ ఉపయోగించవద్దని స్పష్టం చేశారు.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించవద్దంటూ అనేక నిబంధనలతో పాదయాత్రకు అనుమతినిచ్చారు. లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట ఘన్ పూర్ , జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవుర్పుల , పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది.
ఇక తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు వైఎస్ షర్మిల. దొరల పాలన అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీని ఆదరించాలని ప్రజలను కోరుతూ వస్తున్నారు. 2021 అక్టోబర్లో చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించిన ఆమె… ఇప్పటికే 3 వేల కిలో మీటర్లకు పైగా పాదయాత్రను పూర్తి చేశారు.