TS High Court : ఆ సర్వీసు కూడా లెక్కించాల్సిందే… కాంట్రాక్టు ఉద్యోగులకు ఊరట…
16 February 2023, 8:34 IST
- TS High Court కాంట్రాక్టు ఉద్యోగులకు ఊరటనిచ్చేలా తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. రెండు దశాబ్దాలుగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి కాంట్రాక్టు కాలాన్ని కూడా సర్వీసులో లెక్కించాల్సిందేనని తేల్చి చెప్పింది. క్రమబద్దీకరించిన ఉద్యోగుల్ని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలో చేరుస్తూ తీసుకువచ్చిన ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో 120మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది
తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు
TS High Court ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన వారికి ఊరట నిచ్చేలా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన గురుకుల పాఠశాలల్లో 2000-2003 మధ్య కాలంలో దాదాపు 120మంది పలు ఉద్యోగాల్లో నియమితులయ్యారు.వీరిని 2008లో క్రమబద్ధీకరించారు. వారి సర్వీసును సిబ్బంది విధుల్లో చేరిన నియామక తేదీ నుంచే పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2008లో క్రమబద్దీకరించిన ఉద్యోగుల్ని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పరిధిలోకి తీసుకువస్తూ 2018 డిసెంబరులో జారీ చేసిన సర్క్యులర్ చెల్లదని తీర్పు వెలువరించింది. పాతపెన్షన్ విధానంలో రెగ్యులర్ పింఛను ప్రయోజనాలు కల్పించాలని ఆదేశాలిచ్చింది. విధుల్లో చేరిన నియామక తేదీ నుంచి సర్వీసును లెక్కించక పోవడంతో పాటు.. సీపీఎస్ అమలు నిమిత్తం 2018 డిసెంబరు 19న జారీచేసిన సర్క్యులర్ను సవాలు చేస్తూ గిరిజన గురుకులాల బోధన సిబ్బంది కోర్టును ఆశ్రయించారు.
ఉద్యోగుల పిటిషన్పై జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ విచారణ జరిపారు. ఈ వ్యవహారంపై ఇటీవల తీర్పు వెలువరించారు. 'పిటిషనర్లు 2000-2003 వరకు కాంట్రాక్టు పద్ధతిన నియమితులయ్యారని, వారిని ఉద్యోగాల్లో క్రమబద్ధీకరిస్తూ 2008లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు న్యాయవాది తెలిపారు. వారి సర్వీసును మాత్రం నియామక తేదీ నుంచి పరిగణనలోకి తీసుకోలేదని, 2018లో వారికి సీపీఎస్ వర్తింపజేస్తూ సర్క్యులర్ జారీ అయినట్లు చెప్పారు. 2008లో నియమితులైన ఉద్యోగులు రెగ్యులర్ పింఛను పరిధిలోకి రారని గురుకులాల తరఫు న్యాయవాది వాదించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సర్వీసు లెక్కింపునకు సంబంధించి దేవరకొండ శ్రీలక్ష్మి వర్సెస్ ఏపీ గవర్నమెంట్ కేసులో హైకోర్టు తీర్పు వెలువరించిందని, ఆ ప్రకారం కాంట్రాక్టు పద్ధతిన పనిచేసిన సర్వీసును మినహాయించడానికి వీల్లేదన్నారు. ఉద్యోగులకు రెగ్యులర్ పింఛను వర్తింప చేయక పోవడం ఏకపక్షమని పేర్కొన్నారు. 'పింఛను నిబంధన-13 పే స్కేలు సర్వీసును లెక్కించడానికి ఆధారం కాదన్నారు. పిటిషనర్లు 2002 నుంచి దాదాపు రెండు దశాబ్దాలపాటు సేవలందించారని గుర్తు చేశారు.
2004 సెప్టెంబరు తరువాత నియమితులైనందున వారికి గురుకుల సొసైటీ పింఛను వర్తించదని చెప్పడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ల వేతనాలు, విధులు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని, వేతనాలు ప్రభుత్వ నిధి నుంచి పొందుతున్నారని పేర్కొన్నారు. కాంట్రాక్టు కింద కొనసాగిన సర్వీసును కూడా నిబంధనల ప్రకారం పింఛను ప్రయోజనాలకు అర్హతగా పరిగణించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ పరంగా దక్కిన పింఛను ప్రయోజనాలను పొందడం పిటిషనర్ల హక్కు అని న్యాయమూర్తి పేర్కొన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన కాలాన్ని కూడా సర్వీసులో లెక్కించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.