Kishan Reddy On KCR : తెలంగాణకు 5 లక్షల కోట్ల అప్పు ఉంది
25 September 2022, 21:52 IST
- Kishan Reddy Comments On KCR : 5 లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ కూరుకుపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. వివిధ పథకాలు, శాఖలకు సక్రమంగా ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ(Telangana) రాష్ట్రం రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయినట్టుగా కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తన తప్పిదాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేంద్రాన్ని నిందిస్తున్నారని ఆరోపించారు. 'రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. రాష్ట్ర అప్పు రూ.5 లక్షల కోట్లకు చేరింది. పైగా అప్పుల కోసం కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వివిధ పథకాలు, శాఖలకు చెల్లింపులు చేసే పరిస్థితి లేదు. రుణాలు తీసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం జీతాలు కూడా చెల్లించే స్థితిలో లేదు.' అని కిషన్ రెడ్డి అన్నారు.
కేసీఆర్(KCR) ఊహాలోకంలో బతుకుతున్నారని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఇక్కడ ప్రతిపక్ష నాయకులు, సామాజిక సంఘాలను కలవడానికి ఇష్టపడరని, అయితే ప్రత్యేక విమానాల్లో బయటికి వెళ్లి వివిధ నేతలను కలుస్తారని ఎద్దేవా చేశారు. జాతిని ఉద్ధరించగల ఏకైక వ్యక్తి.. రాష్ట్రం అభివృద్ధి(State Development) చెందిందని ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రిని కలిసిన నేతలంతా కేసీఆర్ చెప్పినట్లు కాదంటూ ఖండనలు జారీ చేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం, సకాలంలో పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రం జోక్యం తర్వాత మాత్రమే రాష్ట్రం కోవిడ్-19(Covid 19) మహమ్మారికి సంబంధించిన ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయగలిగిందన్నారు.
వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు బిగించాలన్న టీఆర్ఎస్(TRS) ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చారు కిషన్ రెడ్డి(Kishna Reddy). రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారమని కేంద్రం పదేపదే చెబుతోందని అన్నారు. ధరణి పోర్టల్ (ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్) లోపభూయిష్టంగా ఉండడంతో పలువురు రైతులు(Farmers) ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్రమంత్రి ఆరోపించారు.
ఈ వ్యవస్థలో వివిధ తప్పిదాలపై నాలుగు లక్షల ఫిర్యాదులు వచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్డీయే ప్రభుత్వం(NDA Govt) అధికారంలోకి రాకముందు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రూ.1.45 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అదే రూ.6 లక్షల కోట్లకు చేరిందన్నారు.