KTR Munugode Tour : దత్తత హామీ.. మునుగోడుకు కేటీఆర్
30 November 2022, 19:57 IST
- Munugode Assembly : మునుగోడు ఉపఎన్నిక ముగిసింది. నేతలు అటువైపు చూడట్లేదని విమర్శలు మెుదలయ్యాయి. అయితే ఎన్నికల సమయంలో కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. డిసెంబర్ 1 కేటీఆర్ మునుగోడు వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల సమయంలో కేటీఆర్ దత్తత హామీ
మునుగోడు ఉపఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్(Minister KTR) నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని, మునుగోడు(Munugode) అభివృద్ధిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ మేరకు కేటీఆర్ మునుగోడుకు వెళ్తున్నారు. సమీక్షా సమావేశానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు .
కేటీఆర్ తోపాటుగా మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ ఉదయం 11 గంటలకు మునుగోడుకు చేరుకుంటారు. అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాల సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లను సమీక్షా సమావేశానికి పిలిచారు.
స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సమీక్ష జరగనుంది. పట్టణంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాలులో భేటీ జరగనుంది. ఇప్పటికే.. చర్చించేందుకు మునుగోడు నియోజకవర్గ సమస్యలపై ఉన్నతాధికారులు నివేదికను రూపొందించినట్టుగా తెలుస్తోంది. రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మున్సిపాలిటీల్లో సమస్యలపై.. సమావేశం జరగొచ్చని అంచనా.