Muchintal | రామానుజాచార్యుల మరో అవతారం ఈ సమతామూర్తి విగ్రహం: రాజ్నాథ్ సింగ్
10 February 2022, 22:45 IST
- కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. హిందువుల ఐక్యత కోసం భగవద్రామానుజులు ఎంతో కృషి చేశారు. కులాల గోడలు బద్దలు కొట్టి అసమానతలను రూపుమాపేందుకు కృషి చేశారు. భక్తిలో సమానత్వాన్ని చాటిచెప్పారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
ముచ్చింతల్ క్షేత్రంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
Muchintal | కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ముచ్చింతల్ క్షేత్రంలోని శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకున్నారు. అలాగే 108 దివ్యదేశాల దర్శనం చేసుకొని త్రీడీ లేజర్ షో ద్వారా రామానుజుల జీవితచరిత్రను వీక్షించారు.
సమతామూర్తి ప్రాంగణంలో రాజ్నాథ్ మొక్కలు నాటారు. రాజ్నాథ్ తో పాటు ఆయన వెంట ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్, కేంద్ర మాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. వీరికి చిన్నజీయర్స్వామి, మైహోం రామేశ్వరరావు దగ్గరుండి సమతామూర్తి ప్రాంగణ విశిష్టతను వివరించారు. ఆ తర్వాత అంతా కలిసి ప్రధాన యాగశాలలో పెరుమాళ్కు పూజలు చేశారు. అనంతరం రాజ్నాథ్ సింగ్కు చిన్నజీయర్స్వామీజీ మంగళాశాసనాలు అందజేశారు, అలాగే రామానుజాచార్యుల ప్రతిమలను బహూకరించి సత్కరించారు.
సమాజంలోని అసమానతలకు సమతామూర్తి బోధనలు పరిష్కారం
ప్రవచన మండపంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రామానుజాచార్యుల చరిత్రను చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. రామానుజాచార్యుల సమతా సిద్ధాంతాన్ని వివరించారు. రామానుజాచార్యుల శిష్యుల్లో అన్నికులాలకు చెందినవారున్నారన్నారు. వేలాది మందికి ముక్తి లభించేటపుడు, తాను నరకానికి వెళ్లినా పర్వాలేదని చెప్పిన మహనీయుడు రామానుజాచార్యులని రాజ్నాథ్ కీర్తించారు. లోకకళ్యాణం కోసం, హిందువుల ఐక్యత కోసం భగవద్రామానుజులు ఎంతో కృషి చేశారు. వైష్ణవ సంప్రదాయాలను అన్నివర్గాల ప్రజలకు చేరువ చేశారు. కులాల గోడలు బద్దలు కొట్టి అసమానతలను రూపుమాపేందుకు కృషి చేశారు. భక్తిలో సమానత్వాన్ని చాటిచెప్పారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నేటికీ మన సమాజంలో అసమానతలు ఉన్నాయి. నేటి సమాజం, ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు రామానుజాచార్యుల బోధనలు పరిష్కారం చూపుతాయని రక్షణ మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రపంచమంతా రామానుజాచార్యుల ఉపదేశాన్ని వ్యాప్తి చేయాలని ఆయన కోరారు.
ఇక, ముచ్చింతల్ క్షేత్రంలో కొలువుదీరిన 216 అడుగుల భారీ విగ్రహం రామానుజాచార్యుల మరో అవతారంగా భావిస్తున్నామని రాజ్నాథ్ సింగ్ అన్నారు. రామానుజాచార్యుల విగ్రహ ఏర్పాటుతో యుగయుగాలకు వారి సందేశం మానుష్యజాతికి అందుతుందని చెప్పారు. ఇంతటి గొప్పకార్యం సఫలం చేసినందుకు త్రిదండి చిన్నజీయర్ స్వామిని, మైహోం రామేశ్వరరావును అభినందిస్తున్నట్లు రాజ్ నాథ్ తెలిపారు.