India vs Australia T20I Series 2022: అరుదైన ఘనతకు అడుగు దూరంలో కోహ్లీ.. ఆస్ట్రేలియాతో సిరీస్లో ఇవి బ్రేక్ అవుతాయా?
16 September 2022, 21:08 IST
- India vs Australia T20I Series: ఈ నెల 20 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు టీ20ల సిరీస్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన రికార్డులు నమోదు చేసే అవకాశముంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
విరాట్ కోహ్లీ
Virat Kohli Chance to create rare Records: టీమిండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ.. చాలా కాలం తర్వాత తనదైన శైలి ఆటతో అదరగొట్టాడు. ఇటీవల ఆఫ్గానిస్థాన్తో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో విరాట్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. సెంచరీతో విజృంభించి అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. దీంతో రాబోయే టీ20 వరల్డ్ కప్లో ఇంకా మెరుగ్గా రాణించాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే అంతకంటే ముందు ఈ నెల 20 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్లో కోహ్లీ కొన్ని అరుదైన రికార్డులు కైవసం చేసుకునే అవకాశముంది.
33 ఏళ్ల కోహ్లీ మరో 98 పరుగులు చేస్తే టీ20 కెరీర్లో 11 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ప్రస్తుతం మొత్తం 349 టీ20ల్లో(ఐపీఎల్ కూడా కలుపుకుని) 40.37 సగటుతో 10902 పరుగులు చేశాడు. అంతేకాకుండా 132.95 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉండగా.. 80 అర్ధశతకాలు ఉన్నాయి.
11 వేల పరుగుల మైలురాయి కాకుండా మరో అరుదైన ఘనత సాధించే అవకాశం కూడా ఉంది. మరో 62 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశముంది. తొలిస్థానంలో సచిన్ తెందూల్కర్(34357) ఉండగా.. రెండో స్థానంలో రాహుల్ ద్రవిడ్(24064) ఉన్నాడు. విరాట్ ప్రస్తుతం 468 మ్యాచ్ల్లో 24002 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. 53.81 సగటుతో ఈ పరుగులు నమోదు చేశాడు. ఇందులో 71 సెంచరీలు, 124 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఇటీవలే ఆఫ్గానిస్థాన్తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో శతకం చేసిన కోహ్లీ.. టీ20ల్లో సెంచరీ చేసిన ఏడో భారత బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నారు. ఈ మ్యాచ్లో విరాట్ 122 పరుగులతో ఆకట్టుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆస్ట్రేలియాతో టీమిండియా సెప్టెంబరు 20 నుంచి మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ మంగళవారం నాడు మొహాలీ వేదికగా జరగనుండగా.. సెప్టెంబరు 23న రెండో మ్యాచ్ నాగ్పుర్ వేదికగా జరగనుంది. సెప్టెంబరు 25 ఆదివారం నాడు హైదరాబాద్ వేదికగా మూడో మ్యాచ్ నిర్వహించనున్నారు.