India vs Australia 4th Test: సెంచరీతో కదం తొక్కిన గిల్.. టెస్టుల్లో అరుదైన ఘనత సాధించిన భారత ఓపెనర్
11 March 2023, 15:10 IST
- India vs Australia 4th Test: శుబ్మన్ గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో అరుదైన ఘనత సాధించాడు. ఆసీస్పై సెంచరీ సాధించిన రెండో అతి చిన్న భారత ఓపెనర్గా రికార్డు సృష్టించాడు. గిల్ కంటే ముందు రాహుల్ ఉన్నాడు.
శుబ్మన్ గిల్
India vs Australia 4th Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్ అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్లో గిల్ అద్భుతం సెంచరీతో ఆకట్టుకున్నాడు. టెస్టు కెరీర్లో రెండో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్న గిల్.. అరుదైన ఘనతను సాధించాడు. ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో అతి చిన్న ఇండియన్ ఓపెనర్గా రికార్డు సృష్టించాడు. 23 ఏళ్ల శుబ్మన్ కంటే ముందు కేఎల్ రాహుల్ 2015లో సిడ్నీ వేదికగా టెస్టుల్లో శతకం సాధించాడు. ఆసీస్పై సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు.
మూడో రోజు ఆట థర్డ్ సెషన్లో గిల్ సెంచరీ సాధించాడు. టాడ్ మర్ఫీ వేసిన 62వ ఓవర్లో 100 పరుగులు పూర్తి చేశాడు. 194 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. 70 పరుగులు చేయడానికి గిల్కు 120 పరుగులు అవసరం కాగా.. 80ల్లో రావడానికి మరో 54 బంతులు తీసుకున్నాడు. మూడో రోజు సెకండ్ సెషన్లో ఆస్ట్రేలియా బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ నిలకడగా రాణించాడు. బంతి మృదువుగా మారే కొద్ది పరుగులు తీస్తూ స్కోరు వేగాన్ని పెంచాడు. అలా అని దూకుడుగా ఆడలేదు. ఆచితూచి ఆడుతూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కామెరూన్ గ్రీన్ బౌలింగ్లో బౌండరీలు కొడుతూ పరుగులు రాబట్టాడు.
24 ఏళ్ల లోపు వయస్సులో ఆసీస్పై టెస్టు సెంచరీలు సాధించిన భారత బ్యాటర్లు..
రిషబ్ పంత్- 2019 సిడ్నీ-159*
సచిన్ తెందూల్కర్- సిడ్నీ 1992- 148*
జీఆర్ విశ్వనాథ్- కాన్పూర్ 1969- 137
మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 1964 చెన్నై- 128*
దత్తు ఫాడ్కర్- 1948 అడిలైడ్- 123
విరాట్ కోహ్లీ- అడిలైడ్ 2012- 116
సచిన్ తెందూల్కర్- పెర్త్ 1992- 114
దిలీప్ వెంగ్ సర్కార్- బెంగళూరు 1979- 112
కేఎల్ రాహుల్- సిడ్నీ 2015- 110
ఈ ఏడాది శుబ్మన్ గిల్ ఐదో అంతర్జాతీయ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే న్యూజిలాండ్పై వన్డేల్లో డబుల్ సెంచరీతో పాటు టీ20ల్లో ఓ శతకం నమోదు చేశాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ 2 వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది. క్రీజులో గిల్(120), విరాట్ కోహ్లీ(8) ఉన్నారు.