Rishabh Pant Health : రిషబ్ పంత్కి మరో శస్త్రచికిత్స.. 2023లో ఆడటం కష్టమే!
15 January 2023, 12:35 IST
- Rishabh Pant Health Update : పంత్కి మరో శస్త్రచికిత్స చేయనున్నట్టుగా తెలుస్తోంది. దీంతో 2023లో రిషబ్ క్రికెట్ ఆడతాడా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
రిషబ్ పంత్
భారత క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant) గత నెలలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. డిసెంబరు 30వ తేదీ తెల్లవారుజామున రూర్కీ సమీపంలో రిషబ్ ప్రయాణిస్తున్న కారు.. డివైడర్ను ఢీకొట్టింది. పలుమార్లు పల్టీలు కొట్టి, మంటల్లో చిక్కుకుంది. దీంతో పంత్ కు తీవ్రంగా గాయాలు అయ్యాయి.
గాయాలు ఎక్కువగా ఉన్న కారణంగా.. 2023లో క్రికెట్ ఆటకు దూరంగా ఉండనున్నాడు పంత్. ఎంతగానో ఎదురుచూసిన.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా పంత్ ఆడటం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్కు సైతం దూరంగానే ఉండనున్నాడు. అక్టోబర్-నవంబర్లో భారతదేశంలో జరగనున్న 2023 ODI ప్రపంచ కప్(World Cup)కు పంత్ దూరంగానే ఉంటాడని తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ప్రస్తుతం ముంబైలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కారు ప్రమాదం(Car Accident)లో గాయం కారణంగా కాలికి కొన్ని రోజుల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇప్పుడు మరో సారి శస్త్రచికిత్సకు చేసుకోనునున్నాడు. మరో నాలుగు వారాల్లో చికిత్స జరిగే అవకాశం ఉంది. తగిలిన గాయాలు తగ్గే వరకు విశ్రాంతిలో పంత్ ఉండనున్నాడు. దీంతో 2023లో పంత్ క్రికెట్ ఆడతాడా అని ప్రశ్నలు వస్తున్నాయి.
పంత్ ఐపీఎల్(IPL)లో ఆడటం చాలా కష్టం. ఐపీఎల్లో డెల్లి క్యాపిటల్స్(Delhi Capitals)న తరఫున ఉన్నాడు. ఫ్రాంచైజీ మరో ఆటగాడితోపాటు వీకెట్ కీపర్ ను చూసుకోవాల్సిన అవసరం ఉంది. డేవిడ్ వార్నర్ జట్టు నాయకుడిగా వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే వార్నర్కి ఐపీఎల్లో జట్టును నడిపించిన అనుభవం ఉంది.
రిషబ్ పూర్తిగా కోలుకునేందుకు ఇంకా 8 నెలల సమయం పట్టే అవకాశం ఉందని.. వైద్యులు అంటున్నారు. మళ్లీ క్రికెట్(Cricket) ఆడేందుకు ఏడాది పట్టే ఛాన్స్ ఉంది. త్వరగా కోలుకుని.. జట్టులో ఆట కొనసాగించాలని అందరూ కోరుకుంటున్నారు. పంత్ చికిత్సకు అయ్యే ఖర్చును బీసీసీఐ చూసుకుంటోంది. అయితే మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఈ సీజన్ లో మ్యాచ్ లు ఆడకున్నా.. పంత్ కు పూర్తి జీతం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.
బీసీసీఐ(BCCI) సెంట్రల్ కాంట్రాక్టులో గ్రేడ్ ఏ ప్రకారం.. పంత్ కు ఏటా రూ.5కోట్లు వస్తాయి. ప్రస్తుతం ఎలాంటి మ్యాచ్ ఆడకున్నా.. డబ్బులను చెల్లించనుంది. మరోవైపు ఐపీఎల్ లో దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఆటగాడిగా పంత్ కు రావాల్సిన రూ.16 కోట్లు జట్టుకు అందించాలని ఫ్రాంచైజీని బీసీసీఐ ఆదేశించింది. వచ్చే ఆసియా కప్ వరకు పంత్ అందుబాటులోకి వస్తాడని అనుకుంటున్నా అంతకుమించి సమయం పట్టొచ్చని అంటున్నారు.